సాక్షి, బెంగళూరు : శాసనసభ నుంచి రాజ్యసభకు జరగాల్సిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి బీకే. హరిప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. సంఖ్యా బలం లేకపోవడంతో బీజేపీ, జేడీఎస్లు అభ్యర్థులను నిలపలేదు. నామినేషన్లను దాఖలు చేయడానికి చివరి రోజైన సోమవారం హరిప్రసాద్ తప్ప వేరెవరూ సమర్పించలేదు.
బళ్లారికి చెందిన అనిల్ లాడ్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో శాసన సభకు ఎన్నికయ్యారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక జరపాల్సి వచ్చింది. హరిప్రసాద్ పదవీ కాలం వచ్చే ఏడాది జూన్ 25 వరకు ఉంటుంది. కాగా అసెంబ్లీ కార్యదర్శి, ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఓంప్రకాశ్కు హరిప్రసాద్ నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఆయన వెంట ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్, మంత్రులు ఉన్నారు.
నేనూ నామినేషన్ వేశాను
రాజ్యసభ ఉప ఎన్నికకు తాను కూడా నామినేషన్ను దాఖలు చేసినట్లు సామాజికవేత్త టీజే. అబ్రహాం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన అభ్యర్థిత్వాన్ని ఐదుగురు ఎమ్మెల్యేలు ప్రతిపాదించాల్సి ఉంది. నామినేషన్పై ఎమ్మెల్యేలు సంతకాలు చేయనందున మంగళవారం పరిశీలన సందర్భంగా తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది.