నటి విజయశాంతికి నోటీసులు

18 Sep, 2017 08:48 IST|Sakshi
నటి విజయశాంతికి హైకోర్టు నోటీసులు
తమిళసినిమా (చెన్నై): సీనియర్‌ నటి, రాజకీయ నాయకురాలు విజయశాంతికి ఆస్తుల విక్రయం కేసులో మద్రాసు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. చెన్నై, ఎగ్మూర్‌లోని స్థిరాస్తుల విక్రయానికి సంబంధించి ఇందర్‌చంద్‌ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఎగ్మూర్‌లో విజయశాంతికి చెందిన స్థిరాస్తులను 2006లో తాను రూ.5.20 కోట్లకు కొనుగోలు చేశానని, అందుకు పవర్‌ ఆఫ్‌ అటార్నీ పత్రాలను పొంది రూ.4.68 కోట్లు అందించినట్లు తెలిపారు. కానీ అదే ఆస్తులను విజయశాంతి వేరొకరికి విక్రయించారని పేర్కొన్నారు.

దీంతో విజయశాంతిపై తగిన చర్యలు తీసుకోవలసిందిగా స్థానిక జార్జ్‌ టౌన్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా దాన్ని ఆ కోర్టు కొట్టివేసింది. దీంతో ఇందర్‌చంద్‌ మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌ను శనివారం విచారణకు స్వీకరించారు. ఈ వివాదాన్ని సామరస్యంగా చర్చించి పరిష్కరించుకోవాలని ఆదేశిస్తూ విచారణను సోమవారానికి వాయిదా వేశారు. ఆ రోజు విజయశాంతి స్వయంగా హాజరు కావాలని ఉత్తర్వులు జారీచేశారు. 
మరిన్ని వార్తలు