ఇసుక అక్రమ రవాణాపై హైకోర్టు సీరియస్‌

7 Feb, 2017 13:06 IST|Sakshi
ఇసుక అక్రమ రవాణాపై హైకోర్టు సీరియస్‌
హైదరాబాద్‌: కర్నూలు జిల్లాలోని హంద్రీనీవా నది పరీవాహక ప్రాంతంలో అక్రమంగా ఇసుక రవాణాపై హైకోర్టులో విచారణ జరిగింది. అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారికి లక్ష రూపాయల జరిమానా, రెండేళ్ల జైలు శిక్ష విధించాలని ఆదేశించింది. అక్రమంగా ఇసుక తరలింపుపై గతంలో జిల్లా కలెక్టర్‌కు, ఎస్పీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోక పోవడంతో సురేందర్‌ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేయగా దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్‌ ధాఖలు చేసింది. అక్రమంగా ఇసుక తరలిస్తున్న 320 ట్రాక్టర్లను సీజ్ చేశామని, సీజ్ చేసిన ఇసుకను కర్నూలు 2వ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఉంచామని ప్రభుత్వం తెలిపింది.
 
మరి దీనిపై ఎందుకు క్రిమినల్ కేసులు పెట్టలేదని హైకోర్టు ప్రశ్నించింది. అడ్డగోలుగా ఇసుకను తరలిస్తున్న వారికి జీవో నెంబర్ 42 ప్రకారం రూ. లక్ష జరిమానా ఎందుకు వేయలేదని ఎస్పీ, కలెక్టర్ల తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో, ఇకపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో భూగర్భ గనుల శాఖాధికారి కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. కేసు తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. 
>
మరిన్ని వార్తలు