భార్య గొంతు కోసిన భర్త

17 Jun, 2018 08:40 IST|Sakshi

తనవెంట రాలేదని మనస్తాపం

 విషమ స్థితిలో భార్య

జయపురం: భార్య తనతో రావడం లేదని కోపోద్రిక్తుడైన ఓ భర్త..  భార్య గొంతు కోసి హత్యాయత్నం చేశాడు. నవరంగ్‌పూర్‌ జిల్లా రాయిఘర్‌ సమితిలో జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. ఉమ్మరకోట్‌లోని  డెప్పగుడలో ఉంటున్న స్వామినాథ్‌ హరిజన్, రుబిణ హరిజన్‌లు భార్యాభర్తలు. అయితే వారి మధ్య కలహాల వల్ల ఎనిమిదేళ్లుగా రొబొణి హరిజన్‌ భర్తను విడిచి రాయిఘర్‌లో విడిగా ఉంటోంది. తనతో వచ్చి ఉండమని భర్త ఎప్పటికప్పుడు ఆమెను బలవంతం చేస్తున్నా వెళ్లేందుకు  అంగీకరించడంలేదు. 

దీంతో చివరిసారిగా శుక్రవారం సాయంత్రం మరోసారి తనతో రమ్మని భార్యను భర్త అడిగాడు. అందుకు ఆమె నిరాకరించడంతో కోపోద్రిక్తుడైన స్వామినాథ్‌ హరిజన్‌ బ్లేడుతో భార్య  గొంతును కోశాడు. ఆమె హాహాకారాలు విన్న చుట్టుపక్కల ప్రజలు వచ్చి ఆమెను వెంటనే ఉమ్మరకోట్‌ సామాజిక ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. ఆమె పరిస్థితి ఆందోళన కరంగా ఉండడంతో నవరంగ్‌పూర్‌ జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి ఇంకా విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు నిందితుని అరెస్ట్‌ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు