భార్యకు యాసిడ్ తాగించి..

9 Nov, 2016 18:31 IST|Sakshi
భార్యకు యాసిడ్ తాగించి..

 తన ప్రతిరూపం జీవన సహచరి కడుపులో ప్రాణం పోసుకుంటోంది. కొద్ది నెలల్లో వారి కలలపంట అమ్మ పొత్తిళ్లలోకి చేరనుంది. అయితే ధన పిశాచి ఆవహించిన భర్త సభ్య సమాజం తలదించుకునేలా కిరాతకంగా వ్యవహరించాడు. వరకట్నం కోసం గర్భిణి అయిన భార్యకు యాసిడ్  తాగించి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. కోడలిని కన్నబిడ్డలా చూసుకోవాల్సిన అత్త సైతం  ఈ దారుణానికి సహకారం అందజేసి కర్కశత్వాన్ని చాటుకుంది. ఈ ఘటన కర్ణాటకలోని కోలారు జిల్లా కేంద్రంలో ఆలస్యంగా వెలుగుచూసింది. 
 
పోలీసుల కథనం మేరకు.. కోలారులోని కారంజికట్టకు చెందిన ఉమాభాయి కుమారుడు కేశవరావ్‌కు 8 నెలల క్రితం చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన వీణాబాయి(26)తో వివాహమైంది. తర్వాత  కొద్ది రోజులకే అదనపు వరకట్నమంటూ వీణాబాయిని వేధించడం మొదలుపెట్టాడు.
 
ఆమె తన నిస్సహాయతను వ్యక్తం చేయడంతో భర్త వేధింపులను తీవ్రతరం చేశాడు. కేశవరావ్ నెలన్నర క్రితం తల్లితో కలిసి ఐదునెలల గర్భిణి అయిన వీణాబాయి నోట్లో యాసిడ్ పోశాడు. ఈ విషయం తెలిసి వీణాబాయి పెద్దమ్మ స్థానికుల సహాయంతో బాధితురాలిని బెంగుళూరు సెయింట్‌జాన్‌‌స ఆస్పత్రికి తరలించారు.
 
డిశ్చార్జి అయిన బాధితురాలు తన తల్లి అనుయాబాయితో కలిసి సోమవారం కోలారు మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తన భర్త, అత్త కిరాతక చర్యలను పూసగుచ్చినట్లు వివరించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేశవరావ్, అతని తల్లి ఉమాభాయిలను అరెస్టు చేశారు. 

మరిన్ని వార్తలు