భర్త శవం కోసం ముగ్గురు పెళ్లాల ఘర్షణ

17 Jul, 2019 07:22 IST|Sakshi
సింగారవేలు (ఫైల్‌)

పెద్దభార్యకు అప్పగించిన పోలీసులు

సాక్షి ప్రతినిధి, చెన్నై: నిండా ముప్పై ఏళ్లు కూడా రాకమునుపే ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురిని పెళ్లాడాడు. ముగ్గురు పెళ్లాల ముద్దుల మొగుడిగా ఒకేచోట కాపురం చేస్తూ అకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకోవడం, భర్త శవం కోసం ముగ్గురు పెళ్లాలు పోరాటానికి దిగిన సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాలు... పుదుచ్చేరి కేంద్రపాలిత రాష్ట్రం రెడ్డియార్‌పాళంకు చెందిన సింగారవేలు(30) అనే యువకుడు సత్య అనే యువతిని వివాహమాడాడు.

అయినా పెళ్లిపై మోజు తీరక  ధనలక్ష్మి, కావ్య అనే మరో ఇద్దరిని వరుసగా పెళ్లి చేసుకున్నాడు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముగ్గురు భార్యలతో కలిసి కాపురం చేసేవాడని తెలుస్తోంది. ఇదిలా ఉండగా, కుటుంబసమస్యల కారణంగా సింగారవేలు సోమవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి శవాన్ని పుదుచ్చేరీలోని ఇందిరాగాంధీ వైద్యకళాశాల, ఆసుపత్రికి తరలించారు. ఇంతలో ఆసుపత్రికి చేరుకున్న ముగ్గురు భార్యలు భర్త శవాన్ని తమకే అప్పగించాలంటూ ఎవరికి వారు పోటీపడ్డారు. ఒక దశలో వివాదం ముదిరిపోగా ముగ్గురు ఘర్షణకు దిగారు. దీంతో పోలీసులు కలుగజేసుకుని మంగళవారం పంచాయితీ చేసి పెద్దభార్య సత్యకు సింగారవేలు శవాన్ని అప్పగించారు.

మరిన్ని వార్తలు