నాకు రక్షణ కల్పించండి: చిత్ర దర్శకుడు

11 May, 2014 09:41 IST|Sakshi

తనకు రక్షణ కల్పించాలంటూ అంకుశం చిత్ర దర్శక నిర్మాత మనుకన్నన్ శనివారం ఉదయం నగర పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఒక  వినతిపత్రం ఇచ్చారు. ఈయన సమాచార హక్కుల చట్టం ఇతివృత్తంగా తెరకెక్కిం చిన చిత్రం అంకుశం. ఈ చిత్రం రెండు రోజుల క్రితం విడుదలైంది. మనుకన్నన్ శుక్రవారం స్థానిక అంజికరైలోని ఒక థియేటర్‌కు వెళ్లారు. అక్కడ ఆయనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయపరచి పరారయ్యారు.
 
 చికిత్స అనంతరం ఇంటికి చేరిన ఆయన శనివారం పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఒక పిటిషన్ అందించారు. అందులో ఆయన పేర్కొంటూ తాను అంకుశం చిత్రాన్ని నిర్మించానన్నారు. నగరంలోని పీవీఆర్ థియేటర్‌లో చిత్రం చూడడానికి తాను వెళ్లానని పేర్కొన్నారు. అనంతరం సమీపంలోని ఏటీఎంకు వెళ్లి డబ్బు డ్రా చేయడానికి వెళ్లానని తెలిపారు.
 
 ఆ సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు తనపై దాడి చేసి గాయపరిచారని తెలిపారు. ఇలాంటి పరిస్థితిలో తనకు అసాంఘిక సంఘటనలు ఎదురవుతున్నాయని కాబట్టి తనకు రక్షణ కల్పించాలని, అదే విధంగా అంకుశం చిత్రాన్ని ప్రదర్శిస్తున్న థియేటర్లకు భద్రత ఏర్పాటు చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు