అజిత్‌తో చేస్తున్నా

3 Aug, 2014 23:48 IST|Sakshi
అజిత్‌తో చేస్తున్నా

ప్రస్తుతం తాను తల (అజిత్)తో రొమాన్స్‌లో ఉన్నట్లు నటి త్రిష వెల్లడించారు. తమ కిష్టమైన హీరో ఎవరన్న ప్రశ్నకు బదులివ్వడానికి చాలామంది హీరోయిన్లు దాటవేత ధోరణి అవలంభిస్తారు. నటి త్రిష మాత్రం నిస్సంకోచంగా నచ్చిన హీరో అజిత్ అంటూ ఠకీమని చెప్పేస్తారు. అజిత్ అంటే ఈమెకంత అభిమానం. ఇప్పటికే ముచ్చటగా మూడుసార్లు తన అభిమాన హీరోతో జత కట్టిన త్రిష నాలుగోసారి గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో రొమాన్స్ చేస్తున్నారు. మరో హీరోయిన్‌గా అనుష్క నటిస్తున్న ఈ చిత్రం అజిత్‌కు 55వ చిత్రం కావడం విశేషం.
 
 తిష నటించిన చిత్రాలేవీ 2014లో ఇప్పటి వరకు తెరపైకి రాలేదు. జయం రవి సరసన నటించిన భూలోకం చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. అజిత్‌కు జంటగా నటిస్తున్న తాజా చిత్రం కూడా ఈ ఏడాదిలోనే తెరపైకి రావడానికి ముస్తాబవుతున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో అజిత్ సరసన నటించడం గురించి ఈ చెన్నై చిన్నది చాలా ఎగ్జైటింగ్‌గా ఫీలవుతున్నారు. తన ఫేవరెట్ దర్శకుడు గౌతమ్‌మీనన్ దర్శకుడు కావడం, ఈ ముద్దుగుమ్మ సంతోషానికి మరోకారణం.
 
 ఇంతకు ముందు విన్నై తాండి వరువాయా చిత్రంలో త్రిష పోషించిన జెస్సీ పాత్రను ఆమె ఎప్పటికీ మరచిపోలేదు. అందుకే త్రిష గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో నటించడం మంచి అనుభవంగా భావిస్తుంటారు. తాజాగా అజిత్ సరసన నటిస్తున్న చిత్రం గురించి మాట్లాడుతూ ఇది యాక్షన్ థ్రిల్లర్ కథా చిత్రం అన్నారు. అయితే అజిత్‌తో తాను నటించే సన్నివేశాలన్నీ చాలా రొమాంటిక్‌గా ఉంటాయని చెప్పారు. తాను అజిత్‌తో నటిస్తున్న నాలుగో చిత్రం ఇదన్నారు.
 
 ఈ చిత్రంలో అజిత్ ఆహార్యం, అభినయం చాలా కొత్తగా ఉంటాయన్నారు. చాలాకాలం క్రితం కిరీటం చిత్రంలో అజిత్‌తో తొలిసారిగా నటించానన్నారు. ఆ సమయంలో ఆయన అన్నీ మాస్ కమర్షియల్ చిత్రాలు చేశారని ప్రస్తుతం ఆయన్ని చూస్తుంటే కొత్త అవతారం ఎత్తినట్లు అనిపిస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం తాను అజిత్‌తో డ్యూయెట్ పాడుతున్నానని త్రిష చెప్పారు.

మరిన్ని వార్తలు