ఐటీ దాడుల కలకలం

3 Jan, 2019 11:49 IST|Sakshi

సాక్షి, బెంగళూరు/చెన్నై: కర్ణాటకలో ఐటీ దాడులు కలకలం రేపాయి. ఆదాయపన్ను శాఖ అధికారులు గురువారం ఏకకాలంలో 60 ప్రాంతాలలో దాడులకు దిగడం సంచలనం సృష్టించింది. ప్రధానంగా సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖుల నివాసాలు, కార్యాలయాలల్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి రెండో భార్య రాధిక, సినీ దిగ్గజ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్, కన్నడ కంఠీరవ దివంగత రాజ్‌కుమార్ కుమారులు శివరాజ్‌కుమార్‌, పునీత్ రాజ్‌కుమార్ నివాసాల్లో ఐటీ దాడులు జరగడం చర్చనీయాంశంగా మారింది.

వీరితోపాటు పలువురు నటులు, నిర్మాతల నివాసాలు, కార్యాలయాలపై ఏకకాలంలో ఐటీ దాడులు నిర్వహించింది. హీరో సుదీప్‌, ‘కేజీఎఫ్‌’ నటుడు యశ్‌, ఈ సినిమా నిర్మాత విజయ్‌ ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. రాజకీయ కక్షసాధింపుతోనే కుమారస్వామి భార్య రాధిక నివాసంలో ఐటీ దాడులు చేపట్టారని జేడీ(ఎస్‌) నాయకులు ఆరోపిస్తున్నారు.

చెన్నైలోనూ ఐటీ దాడులు
తమిళనాడు రాజధాని చెన్నైలోని పలు ప్రముఖ హోటళ్లపై ఐటీ అధికారులు దాడులు చేశారు. 32 ప్రాంతాల్లో ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. పన్ను ఎగవేత కారణంతో శరవణభవన్, అంజప్పార్ తదితర ప్రముఖ హోటళ్లలో తనిఖీలు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు