సెల్ఫీ కొట్టు...లక్ష పట్టు..!

9 Aug, 2017 19:18 IST|Sakshi
సెల్ఫీ కొట్టు...లక్ష పట్టు..!

బెంగళూరు: ఆగస్టు 15 నుంచి నగరవ్యాప్తంగా అందుబాటులోకి రానున్న ఇందిరా క్యాంటీన్లకు విస్తృత ప్రచారం కల్పించేందుకు బీబీఎంపీ సెల్ఫీ విత్ ఇందిరా క్యాంటీన్ కార్యక్రమాన్ని రూపొందించింది. నగరవ్యాప్తంగా ఏర్పాటు చేయనున్న ఇందిరా క్యాంటీన్లకు చేరుకోవడానికి వీలుగా బీబీఎంపీ అభివృద్ది చేస్తున్న మొబైల్ యాప్ మరో వారం రోజుల్లో అందుబాటులోకి రానుంది. ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఇందిరా క్యాంటీన్ ముందు సెల్ఫీ తీసుకొని అందుకు అనుబంధంగా ట్యాగ్లైన్  పెట్టి యాప్లో అప్లోడ్ చేయాలి.

 ఇలా పంపిన సెల్ఫీల్లో ఉత్తమ సెల్ఫీ పంపిన వారిని విజేతలుగా ప్రకటించి రూ. 1 లక్ష నగదు బహుమానాన్ని అందించనున్నట్లు బీబీఎంపీ ఆర్థికవిభాగం ప్రత్యేక కమిషనర్ మనోజ్ రాజన్ తెలిపారు. ఆగస్టు 15న 106 ప్రాంతాల్లో ఇందిరా క్యాంటీలను ప్రారంభించనుంది. అందులో  80 క్యాంటీన్లు ఇప్పటికే నిర్మాణ  పనులను పూర్తి చేసుకున్నాయి. ఆగస్టు 10 నుంచి 750 మంది కేటరింగ్ సిబ్బందికి మల్లేశ్వరంలోని ఐపీపీ కేంద్రంలో శిక్షణ ఇవ్వనున్నారు.

ఆగస్టు 15న బెంగళూరు నగరంలోని నేషనల్ కాలేజ్ క్రీడా మైదానంలో ఇందిరా క్యాంటీన్ల ప్రారంభోత్సవంలో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొనే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్  పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇందిరా క్యాంటీన్లను ఈనెల 15న ప్రారంభిస్తామని చెప్పిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే క్యాంటీన్లలను ఏర్పాట్లు చేసి  నగరంలో అందుబాటులోకి కాంగ్రెస్ ప్రభుత్వం తేనుంది.

మరిన్ని వార్తలు