ఇన్ఫోసిస్ ఉద్యోగ మేళాకు భారీ స్పందన

14 Feb, 2014 01:43 IST|Sakshi

బళ్లారి టౌన్, న్యూస్‌లైన్ : నగరంలోని వీరశైవ విద్యాలయంలో గురువారం ఇన్ఫోసిస్ కంపెనీ నిర్వహించిన ఉద్యోగ మేళాకు భారీ స్పందన లభించింది. ఈ కార్యక్రమాన్ని ముందుగా కళాశాల ప్రిన్సిపాల్ బసవరాజ్ ప్రారంభించి మాట్లాడుతూ ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అధ్యక్షురాలు సుధా నారాయణమూర్తి గతంలో ఈ కళాశాలలో చదివిందని గుర్తు చేశారు.

ఇదే కళాశాలలో ఆ కంపెనీ బృహత్ క్యాంపస్ ఇంటర్వ్యూలు జరపడంతో తాము ఎంతో గర్విస్తున్నామన్నారు. ఇలాంటి వెనుకబడిన ప్రాంతాలలో ఉద్యోగాలు కల్పించి పేద విద్యార్థులను ఆదుకోవాలన్నారు. కార్యక్రమంలో కళాశాల పాలక మండలి అధ్యక్షుడు జానెకుంటె సన్న బసవరాజు, ప్రొఫెసర్లు కే.మల్లికార్జునప్ప, ఎం.భోజరాజు, కంపెనీ హెచ్‌ఆర్ ఎగ్జిక్యూటివ్ ప్రశాంత్, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.

కాగా ఈ ఇంటర్వ్యూల్లో స్థానిక కళాశాలతోపాటు అల్లం సుమంగళమ్మ కళాశాల, హొస్పేట విజయనగర కళాశాల, కొట్టూరేశ్వర కళాశాల, సిరుగుప్ప ప్రభుత్వ కళాశాలకు చెందిన 487 మంది బీఏ, బీకాం, బీబీఎం, బీఎస్సీ విద్యార్థులు పాల్గొనగా 80 మంది ఎంపికయ్యారు. ఇందులో స్థానిక వీరశైవ కళాశాలకు చెందిన 40 మంది విద్యార్థులు, హొస్పేట విజయనగర కళాశాల నుండి 34 మంది, అల్లం సుమంగళమ్మ కళాశాలకు చెందిన ఆరుగురు ఎంపికయ్యారు.
 

>
మరిన్ని వార్తలు