‘అలా చేయడం అమ్మను అవమానించడమే’

18 Nov, 2017 10:56 IST|Sakshi

ఈపీఎస్‌, ఓపీఎస్‌ కలిసే డ్రామ ఆడుతున్నారు..

జయలలిత ఆత్మ క్షోభిస్తుంది: దినకరన్‌

సాక్షి, చెన్నై :  దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివాసంలో ఐటీ సోదాలు చేయడం అమ‍్మను అవమానించడమే అని అన్నాడీఎంకే బహిష్కృత నేత, శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్‌ వ్యాఖ్యానించారు.. పోయెస్‌ గార్డెన్‌, వేద నిలయంలో ఐటీ దాడులు నిర్వహించడంపై  ఆయన మండిపడ్డారు. ఈపీఎస్‌, ఓపీఎస్‌ కలిసే ఈ డ్రామా ఆడుతున్నారని దినకరన్‌ మండిపడ్డారు. డీఎంకే హయాంలో జయలలిత నివాసంలో సోదాలు జరిగాయని, అయితే ఇప్పుడు అన్నాడీఎంకే పాలనలోనే పోయెస్‌ గార్డెన్‌లో తనిఖీలు జరగడంతో జయలలిత ఆత్మ క్షోభిస్తుందన్నారు.

ఇటీవల శశికళ, దినకరన్, జయ టీవీ కార్యాలయంతో పాటు దేశంలోనే 187 ప్రాంతాలలో రికార్డు స్థాయిలోదాడులు జరిగిన విషయం విదితమే. అయితే ఇప్పటి వరకు జరిగిన దాడులపై గుంభనంగానే ఉన్నా జయలలిత నివాసంలో తనిఖీలపై తీవ్ర నిరసన ఎదురవుతోంది. ముందస్తుగానే న్యాయస్థానం అనుమతి తో జయటీవీ ఎండి వివేక్ నుండి తాళాలు తీసుకున్న అధికారులు జయ నివాసంలో సుమారు మూడు గంటలపాటు ఈ తనిఖీలు నిర్వహించారు. ఇక్కడి జయ అంతరంగిక గదితోపాటు ఆమె సహాయకుడైన పూకుండ్రన్ గది‌ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన అధికారులు అక్కడి నుండి ఓ ల్యాప్ టాప్, నాలుగు పెన్ డ్రైవ్లు స్వాధీనం చేసుకున్నారు. మొత్తానికి జయ నివాసంలో ఐటీ దాడులు సర్వత్రా విమర్శలను ఎదుర్కొంటుంది.

మరిన్ని వార్తలు