బాధ్యతల నుంచి తప్పుకుంటున్న పత్రికారంగం

20 Jan, 2015 02:25 IST|Sakshi

ఎమ్మెల్యే రమేష్‌కుమార్

 కోలారు : శాసన నిర్మాణ శాఖ, న్యాయశాఖలో ఎలాంటి లోపాలు జరగకుండా చూడాల్సిన పత్రికా రంగం తన బాధ్యతల నుంచి తప్పుకుంటోందని శ్రీనివాస పురం ఎమ్మెల్యే రమేష్‌కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం స్థానిక పాత్రికేయుల భవనలో పంచ మ వాణి స్థానిక దిన పత్రిక విడుదల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.  మీడియా రంగం నేడు కార్పొరేట్ సంస్థల చేతిలో చిక్కి ప్రజల ఆకాంక్షలను విస్మరిస్తోందన్నారు.

ప్రజాస్వామ్య వ్యవస్థలో జరిగే తప్పులను కనుగొని జాగృతం చేయాల్సిన బాధ్యత పత్రికా రంగంపై ఉందన్నారు. తప్పులను ఒప్పులు గాను, ఒప్పులను, తప్పులుగాను ప్రతిబింభించే తత్వం పత్రికా రంగానికి ఉండకూడదన్నారు. ఇది సమాజానికి తప్పుడు సందేశాన్ని పంపిస్తోందన్నారు. పత్రికా రంగాన్ని నడుపుతున్న కొంత మంది శ్రీమంతులు ప్రభుత్వంపై పట్టు సాధించడానికి ప్రయత్నిస్తుంటే ఇక ప్రజా స్వామ వ్యవస్థకు అర్థం ఏముంటుందని ప్రశ్నించారు. కొన్ని వార్తా సంస్థలు తమ సొంత అభిప్రాయాలను ప్రజలపై రుద్దుతున్నాయన్నారు. సమాజం కోరుకునే విషయాలకు మీడియా అధిక ప్రాధాన్యతనిస్తే ఎక్కువ కాలం మనజాలతాయని అన్నారు.  పత్రికలు ప్రామాణికతను కలిగిఉన్నప్పుడే ప్రజల విశ్వాసం పొందడం సాధ్యమవు తుందని ఎమ్మెల్యే వర్తూరు ప్రకాష్ అన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ త్రిలోక్‌చంద్ర, దళిత నాయకుడు సిఎం.మునియప్ప, పాత్రికేయుల సంఘం మాజీ అధ్యక్షుడు బివి గోపినాథ్, అధ్యక్షుడు గణేష్, పంచమవాణి పత్రికా సంపాదకుడు సివి నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు