మోగనున్న కల్యాణ వీణ

16 Nov, 2016 09:07 IST|Sakshi
మోగనున్న కల్యాణ వీణ
బళ్లారి : కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి కుమార్తె వివాహం బుధవారం బెంగళూరులోని ప్యాలెస్‌ మైదానంలో అంగరంగ వైభవంగా జరిపేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. నగరం నడిబొడ్డున 36 ఎకరాల విస్తీర్ణంలోని ప్యాలెస్‌ మైదానంలో తిరుపతి, హంపి, బళ్లారి తరహాలో సినీ సెట్టింగ్‌లతో అత్యద్భుతంగా పెళ్లి వేదికను తీర్చిదిద్దారు. నాలుగు రోజులుగా సాంస్కృతిక కార్యక్రమాలు ఉర్రూతలూగించేలా  నిర్వహిస్తున్నారు. 
 
నిన్న రాత్రి మెహందీ కార్యక్రమంలో భాగంగా పెళ్లి కుమార్తెతో పాటు పెళ్లికి హాజరైన మహిళలందరికీ మెహందీ అలంకరించారు. ఈ సందర్భంగా సంగీత, నృత్య కార్యక్రమాల్లో పలువురు సినీ తారలు పాల్గొని తమ నృత్యాలతో అలరించడంతో పెళ్లికి కొత్త శోభ సంతరించుకుంది. కాగా ఈ రోజు ఉదయం జరుగనున్న వివాహ కార్యక్రమానికి పలువురు కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు, మంత్రులు, రాజకీయ నాయకులు హాజరయ్యే అవకాశం ఉంది.
 
ఆహుతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. రంగు రంగుల విద్యుద్దీపాలతో ప్యాలెస్‌ మైదానం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. వివాహ వేడుకకు హాజరైన వారికి వడ్డించేందుకు దేశంలోని వివిధ రకాల వంటకాలను కూడా సిద్ధం చేశారు. ఈ వివాహ వేడుకకు గాలి జనార్దనరెడ్డి స్వస్థలం బళ్లారితో పాటు జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు, మద్దతుదారులు, కార్యకర్తలు ప్రత్యేక వాహనాల్లో ఇప్పటికే బెంగళూరు తరలివెళ్లారు.   

 
మరిన్ని వార్తలు