జయచంద్రన్ కుటుంబ సభ్యుల ప్రకటన
తిరువొత్తియూరు: చెన్నై చాకలిపేటలో రూ.2 లకు వైద్యం చేస్తున్న డాక్టర్ ఇటీవల కాలంలో మృతి చెందారు. ఆయన మృతి చెందిన తర్వాత ఆస్పత్రిని ఆయన కుటుంబ సభ్యులు కొనసాగిస్తున్నారు. చెన్నై పాత చాకలిపేట వెంకటాచలపతి వీధిలో ఉన్న డాక్టర్ జయచంద్రన్ పేదలకు అతి తక్కువ ఫీజు రూ.2లకే 30 ఏళ్లు సేవలు అందించారు.
ఆ ప్రాంతంలోని కాశిమేడు, కొడుంగయూర్ ప్రాంతాల్లోని ప్రజలు వైద్య సేవలు పొందారు. ప్రారంభంలో డాక్టర్ జయచంద్రన్ రూ.2లకే వైద్యం అందించినప్పటికీ ప్రజల కోరిక మేరకు ఆ ఫీజును రూ.5లకు పెంచారు. తన జీవిత కాలమంతా పేదల కోసం రూ.5లకే వైద్యం చేశారు. ఈ క్రమంలో డాక్టరు జయచంద్రన్ అనారోగ్యంతో గత ఏడాది డిసెంబర్లో మృతి చెందారు. ఆయన మృతి ఆ ప్రాంత ప్రజలను శోకసముద్రంలో ముంచింది. డాక్టరు మృతితో ఇక తక్కువ ధరకు వైద్యం అందదని ప్రజలు భావించారు. కాని డాక్టర్ జయచంద్రన్ కుటుంబ సభ్యులు ఆ ఆస్పత్రిని కొనసాగించాలని నిర్ణయించారు. డాక్టర్ జయచంద్ర భార్య వేణి, కుమారులు శరవణన్, సరత్రాజ్ ముగ్గురూ డాక్టర్లే కావడంతో ఆస్పత్రిలో రూ.5కే వైద్యం చేస్తున్నారు.