వీరాభిమానంతో వేలు కోసుకున్నాడు!

20 May, 2016 22:59 IST|Sakshi
వీరాభిమానంతో వేలు కోసుకున్నాడు!

టీనగర్ (చెన్నై): మితిమీరిన వ్యక్తి ఆరాధనకు కేరాఫ్ అడ్రస్ అయిన తమిళనాడులో చేతి వేలు కోసుకున్న మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో అమ్మ జయలలిత ఘనవిజయానికి పొంగిపోయిన ఓ అభిమాని తన చిటికెనవేలును కోసుకుని ఉప్పొంగిపోయాడు. వివరాల్లోకి వెళితే..

నామక్కల్ జిల్లా రాశిపురానికి చెందిన తంగరాజు చెక్క మంచాల వ్యాపారి. ఆయనకు అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత అంటే చచ్చేంత అభిమానం. ఓటుకూడా రెండు ఆకుల గుర్తుకే వేశాడు. ఫలితంపై ధీమాగాఉన్న తంగరాజు.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో కంగారుపడ్డాడు. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్ సంస్థలు అమ్మ ఓడిపోతుందని చెప్పడంతో తట్టుకోలేకపోయాడు. దీంతో రాశిపురంలోని మునియప్పన్ ఆలయానికి వెళ్లి మొక్కుకున్నాడు.. 'దేవుడా.. అమ్మ గెలిస్తే నీకు నా వేలిని సమర్పించుకుంటా' అని!

గురువారం ఫలితాలు వెల్లడికావడం, జయలలిత తిరిగి అధికారపీఠం చెపట్టడం ఖరారుకావడంతో తంగరాజు ఆనందానికి అవధులు లేకుండాపోయింది. వెంటనే మునియప్ప ఆలయానికి వెళ్లి, కత్తితో తన ఎడమచేతి చిటికెనవేలును కోసి హుండీలో వేసు ప్రయత్నం చేశాడు. దీన్ని గమనించిన అతని స్నేహితుడు తంగరాజును హుటాహుటిన స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాడు. అనంతరం మెరుగైన చికిత్స కోసం తంగరాజును సేలం ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు.

మరిన్ని వార్తలు