జేపీ వ్యాఖ్యలు విడ్డూరం

20 Jan, 2014 02:28 IST|Sakshi

 బెంగళూరు, న్యూస్‌లైన్ : ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే జయప్రకాష్ నారాయణ(జేపీ) మాటలు విడ్డూరంగా ఉన్నాయని, సీమాంధ్రుల మనోభావాలకు ఆయన తూట్లు పొడుస్తున్నారని కర్ణాటక తెలుగు ప్రజా సమితి(కేటీపీఎస్) అధ్యక్షుడు బొందు రామస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన స్థానిక విలేకరుల సమావేశంలో మాట్లాడారు.  టీబిల్లుపై చర్చ సందర్భంగా జేపీ మాట్లాడిన తీరును ఆయన తప్పుబట్టారు. అసెంబ్లీలో టీ బిల్లుపై చర్చ అనవసరమని, దానిని వెనక్కు పంపాలని ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పడే తెలంగాణ వాసులు ప్రశాంత జీవనం గడుపుతారని అన్నారు. హైదరాబాద్‌లో ఉండేందుకు తెలుగువారికే స్థానం లేకపోతే ఇక పొరుగు రాష్ట్రాల వారి పరిస్థితి ఎంత దారుణంగా మారుతుందో ఊహించలేమని అన్నారు.
 
  రాష్ర్ట విభజన అనంతరం ఛత్తీస్‌గడ్ నేటికీ అభివృద్ధికి నోచుకోలేకపోయిందని గుర్తు చేసారు. ఇదే పరిస్థితి సీమాంధ్రలోనూ తలెత్తకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలంగాణను కోరుకుంటున్నది శ్రీమంతులు, దొరలు మాత్రమేనని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని అత్యధికులు తెలంగాణ ఏర్పాటుకు అనుమతిస్తే అలాగే విభజన చేయాలని సూచించారు. సమావేశంలో కేటీపీఎస్ నాయకులు బాబు రాజేంద్ర కుమార్, శివకుమార్, అంబరీష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు