తాటిపాక(రాజోలు) : కాపు రిజర్వేషన్ సాధనే నా ఊపిరి అని, ఆర్థికంగా, సామాజికంగా కాపులు అనేక మంది వెనుకబడి ఉన్నారని కాపు రిజర్వేషన్ పోరాట ఉద్యమ నేత, మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం అన్నారు. బుధవారం ఆయన తాటిపాక విచ్చేసి మాజీ ఏఎంసీ చైర్మన్ జక్కంపూడి తాతాజీ స్వగృహం వద్ద కాపు ఉద్యమ నాయకులు, కార్యకర్తలను కలిశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాపు రిజర్వేషన్ ఉద్యమంలో కాపు కుటుంబాలు ఇచ్చిన మద్దతు ఎంతో మనోబలాన్ని ఇచ్చిందన్నారు. ఉద్యమం పేరుతో అనేక మందిపై కేసులు పెట్టారని కాపు నాయకులు పలువురు ముద్రగడకు వివరించారు. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండకుండా కాపు రిజర్వేన్ పై ఎటువంటి స్పష్టమైన ప్రకటన చేయకపోవడం దారుణమన్నారు. ఉద్యమానికి సహకరించిన కాపు నాయకులకు, కార్యకర్తలకు ముద్రగడ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర కాపు జేఏసీ నాయకుడు ఆకుల రామకృష్ణ, నాయకులు అడబాల తాతకాపు, తోరం భాస్కరరావు, జక్కంపూడి వాసు తదితరులు పాల్గొన్నారు.