మహిళారైతు మీద వ్యాఖ్యలపై కేసు నమోదు?
బొమ్మనహళ్లి (బెంగళూరు): సీఎం కుమారస్వామికి వరుస చిక్కులు ఎదురవుతున్నాయి. కనీవినీ ఎరుగని రీతిలో చెరుకు రైతుల ఆందోళన, వారిపై ఆయన చేసిన వ్యాఖ్యలతో ఇబ్బందులు తప్పలేలా లేవు. మద్దతు ధర ప్రకటించాలని, చెరుకు ఫ్యాక్టరీల నుంచి బకాయిలు చెల్లించాలని ఆందోళనలోపాల్గొన్న మహిళను ఉద్దేశించి కుమారస్వామి చేసిన వ్యాఖ్యలపై ఆయనపై కేసు నమోదుకు ఆదేశించారు. బెళగావిలో రైతుల నిరసనలో మహిళా రైతు జయశ్రీ ఆరోపణలు చేయడంపై కుమారస్వామి స్పందిస్తూ..
‘ఈ నాలుగేళ్లు ఎక్కడ పడుకున్నావమ్మా...’ అని వ్యాఖ్యానించారు. ఈ విషయం తెలిసి జయశ్రీ విలపించింది. సీఎం తనను కించపరిచారని, న్యాయం చేయాలని మీడియాముఖంగా కోరింది. దాంతో కార్మిక సంక్షేమ శాఖ సుమోటోగా పరిగణించి డీజీపి నీలమణి రాజు , మానవ హక్కుల కమిషన్కు కేసు నమోదు చేయాలని ఆదేశించింది. మహిళ పట్ల అగౌరవంగా మాట్లాడిన అభియోగాలపై సీఎం కుమారస్వామి పై 504, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని పేర్కొంది.