మంత్రి గిఫ్ట్‌ ను తిరస్కరించిన ముఖ్యమంత్రి

19 Oct, 2016 09:11 IST|Sakshi
మంత్రి గిఫ్ట్‌ ను తిరస్కరించిన ముఖ్యమంత్రి

బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కానుకలంటే హడలిపోతున్నారు. గతంలో హోబ్లేట్‌ వాచ్‌ వ్యవహారంలో పీకల్లోతు కూరుకుపోయి...అనంతరం ఏసీబీ క్లీన్‌చిట్‌తో బయటపడిన ఆయన కానుకలు అంటేనే జంకుతున్నారు. తాజాగా తన మంత్రివర్గ సహచరుడు, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి ఏ. మంజు మంగళవారం విధాన సౌధలో సిద్ధరామయ్యకు ఓ గిఫ్ట్‌ ప్యాక్‌ను అందజేశారు. ముఖ్యమంత్రి ఏమాత్రం ఆలోచించకుండా ఆ గిఫ్ట్‌ను తీసుకోడానికి నిరాకరించారు. మంజు వివరణ ఇవ్వడంతో అందులో ఏమున్నాయని సిద్ధరామయ్య ప్రశ్నించారు. కేవలం సిల్క్‌ జుబ్బాలు ఉన్నాయని స్వీకరించాలని కోరారు. దీంతో సీఎం అలాంటివి తాను ధరించనని సున్నితంగా తిరస్కరించారు.

కాగా గతంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ధరించిన రూ.70 లక్షల రూపాయల ఖరీదు చేసే లగ్జరీ వాచ్ రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారాన్నే రేకెత్తించింది. సాధారణ జీవితాన్ని గడిపేందుకు ఇష్టపడతానని చెప్పుకునే ఆయన ఇంత ఖరీదు చేసే వాచ్‌ను ఎలా కొన్నారు? ఒక వేళ సిద్ధరామయ్య కొనకపోతే ఎవరైనా బహుమతిగా ఇచ్చారా? బహుమతిగా అందుకొని ఉంటే అందుకు ప్రతిఫలంగా సిద్దరామయ్య ఏం చేశారు? అంటూ మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి సంధించిన ప్రశ్నలు అప్పట్లో కలకలాన్ని రేపాయి. ఇక ఈ వాచ్ వ్యవహారం ఏకంగా కాంగ్రెస్ హైకమాండ్ దృష్టికి కూడా వెళ్లిన విషయం తెలిసిందే. దీనిపై ఏసీబీ విచారణ కూడా చేపట్టింది. విచారణలో సిద్ధూకు క్లీన్ చిట్ రావటంతో ఊపిరిపీల్చుకున్నారు. దీంతో అప్పటి నుంచి కానుకలు అంటేనే సిద్ధరామయ్య భయపడుతున్నారు.

మరిన్ని వార్తలు