ఇంకా అక్కడే

6 Aug, 2014 04:08 IST|Sakshi

 సాక్షి ప్రతినిధి, బెంగళూరు : బాగలకోటె జిల్లా సూళికేరిలో బోరు బావిలో పడిపోయిన ఆరేళ్ల బాలుడు తిమ్మన్నను వెలికి తీయడానికి మంగళవారం మూడో రోజూ సహాయక చర్యలు ముమ్మరంగా సాగాయి. 160 అడుగుల లోతులో పడిపోయిన ఆ బాలుని వెలికి తీయాలంటే సమాంతరంగా తవ్వుతున్న గుంత పనులు పూర్తి కావడానికి ఇంకా సమయం పడుతుందని జిల్లా అధికారులు చెబుతున్నారు. బాలునిపై పడిన మట్టిని తొలగించడానికి బాగలకోటె మునిసిపల్ కార్పొరేషన్ నుంచి వ్యాక్యూమ్ సక్కర్‌ను తెప్పించారు. మరో వైపు సహాయక చర్యలను నిలిపి వేయాల్సిందిగా బాలుని తండ్రి హనుమంత హట్టి అధికారులకు విజ్ఞప్తి చేశాడు.
 
 సహాయక చర్యల వల్ల ఉన్న భూమి కూడా నాశనమై పోతోందని వాపోయాడు. భూమి పోతే ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నాడు. అయితే జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఎస్‌ఆర్. పాటిల్ దీనికి సమ్మతించలేదు. ఆయన తీవ్ర ఆవేదనలో ఉన్నాడని, అతను చెప్పిన విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. మరో వైపు బోరు బావుల్లో పడిపోయిన వారిని సురక్షితంగా వెలికి తీయడానికి రూపొందించిన రోబోతో మధురై నుంచి మణికంఠన్ సంఘటనా స్థలం వద్దకు చేరుకున్నాడు.
 

>
మరిన్ని వార్తలు