పెట్రోల్, డీజిల్‌పై అమ్మకం పన్ను పెంపు

5 Jan, 2019 12:09 IST|Sakshi

 రుణమాఫీ లోటును పూడ్చడానికి ప్రజలపై భారం

సాక్షి బెంగళూరు: కొత్త ఏడాది రాష్ట్ర ప్రజలకు హెచ్‌డీ.కుమారస్వామి ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్‌ అమ్మకపు పన్నును పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. ప్రతి లీటరు పెట్రోల్‌పై 3.27 శాతం, డీజిల్‌పై 3.27 శాతం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం  ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది  సెప్టెంబర్‌ నుంచి పెట్రోల్‌పై 28.75 శాతం, డీజిల్‌పై 17.73 శాతం మేర అమ్మకపు పన్నును రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తోంది. అయితే ప్రస్తుత పెంపు నేపథ్యంలో అమ్మకపు పన్ను పెట్రోల్‌పై 32 శాతం, డీజిల్‌పై 21 శాతానికి చేరుకుంది.

అమ్మకపు పన్ను పెంపు వల్ల రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్‌ ధరల్లో ఒక రూపాయిమేర మార్పు కనిపించనుంది. ఒకవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు తగ్గుముఖం పడుతున్నప్పటికీ మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం పన్ను పెంచుతూ ఆదేశాలు జారీచే యడం గమనార్హం. శుక్రవారం అర్ధరాత్రి నుంచి  ఈ కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. దీంతో కర్ణాటకలో శుక్రవారం పెట్రోల్‌ ధర 69.01 ఉండగా పెంపు తర్వాత రూ. 70.35కు చేరుకుంంది. అలాగే డీజిల్‌ కూడా రూ. 62.80 ఉండగా.. అది కాస్తా 64.13కు చేరుకుంది. ప్రతి లీటరు పెట్రోల్‌ రూ.70.35, డీజిల్‌ రూ.69.21  మేర «లభించనున్నాయి. రాష్ట్రప్రభుత్వం సుమారు రూ.46 వేల కోట్లు రైతుల రుణమాఫీకి హామీనిచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఖజానాకు ఏర్పడిన లోటును పూరించుకునేందుకు పెట్రోల్, డీజిల్‌ అమ్మకపు పన్నును పెంచుతూ నిర్ణయం తీసుకుందని అందరూ భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు