నడుస్తూనే షాపులకు వెళ్లాలి

31 Mar, 2020 07:40 IST|Sakshi

వస్తు కొనుగోళ్లకు వాహనాలు వాడరాదు  

హోంమంత్రి బొమ్మై  

కర్ణాటక, శివాజీనగర: లాక్‌డౌన్‌ను కట్టుదిట్టం చేస్తున్నాం. బైక్‌లు, కార్లు, టెంపోలలో వెళ్లి సరుకులను కొనుగోలు చేయడం కుదరదు అని హోం మంత్రి బసవరాజ్‌ బొమ్మై తెలిపారు. సోమవారం విధానసౌధలో కరోనా ముందుజాగ్రత్తల పై పోలీస్‌ అధికారులతో ఆయన సమావేశమై చర్చించారు. ప్రజలు వివిధ వస్తువులను తీసుకురావటానికి నడచుకొంటూ వెళ్లాలి. ఏ వాహనాన్ని ఉపయోగించరాదు. అదే ప్రాంతంలోనే వస్తువులను కొనాలి అని తెలిపారు. వలస కార్మికులు బయటికి వెళ్లకుండా తగిన చర్యలు తీసుకోవాలి. బెంగళూరు కల్యాణ మండపాల్లో వారికి భోజన వసతి కల్పించాలి. ఈ ఏర్పాట్లను బీబీఎంపీ కల్పిస్తుంది. జిల్లాల్లో కలెక్టర్లు ఈ ఏర్పాట్లు చేయాలి. 

లాక్‌డౌన్‌ నేపథ్యంలో బీబీఎంపీ అధికారులు దుకాణదారులను బాడుగ చెల్లించాలని ఒత్తిడి చేయరాదు.బాడుగదారులను, పీజీల్లో ఉన్నవారిని బలవంతంగా ఖాళీ చేయించరాదు. ఒత్తిడి చేస్తే కేసును ఎదుర్కోవాల్సి వస్తుంది. వైద్యులు, నర్స్‌లకు ఇబ్బంది కలిగిస్తే కేసులు నమోదు చేస్తాం అని చెప్పారు. ఈ సమావేశంలో డీసీఎం అశ్వత్థ్‌నారాయణ, సీఎస్‌ విజయభాస్కర్, డీసీపీ ప్రవీణ్‌ సూద్‌  తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు