మా ఫోన్లను కేంద్రం ట్యాప్‌ చేస్తోంది..

20 Sep, 2017 08:47 IST|Sakshi
మా ఫోన్లను కేంద్రం ట్యాప్‌ చేస్తోంది..

కర్ణాటక సీఎం సిద్ధు, హోంమంత్రి రామలింగారెడ్డి ఆరోపణ

సాక్షి, బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తుండగా, కన్నడనాట అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీజేపీల మధ్య ఇప్పుడు ఫోన్‌ ట్యాపింగ్‌ గొడవ మొదలైంది.  బెంగళూరులో సీఎం క్యాంపు కార్యాలయంలో హోం మంత్రి రామలింగారెడ్డి మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ....‘రాష్ట్రానికి చెందిన కొంత మంది మంత్రులతో పాటు ప్రముఖ నేతల ఫోన్లను కేంద్ర ప్రభుత్వం ట్యాప్‌ చేస్తోంది. గత కొంత కాలంగా కేంద్రం ఈ విధంగా ఫోన్లను ట్యాప్‌ చేస్తూ వస్తోంది’ అని ఆరోపించారు. ’రాష్ట్ర ప్రభుత్వం ఎవరి ఫోన్లనూ ట్యాపింగ్‌ చేయడం లేదు. బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణల్లో ఎంత మాత్రం వాస్తవం లేదు.

కేవలం కేంద్రం చేస్తున్న ఫోన్‌ ట్యాపింగ్‌ను కప్పిపుచ్చుకునేందుకే ఇలా ఆరోపణలు చేస్తున్నారు’ అని ఆయన అన్నారు. సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ...‘కేంద్రం ఎప్పటి నుంచో రాష్ట్ర మంత్రులు, ఇతర నేతల ఫోన్లను ట్యాప్‌ చేస్తూ వస్తోంది. అయితే ఈ అంశంపై నేను ఇప్పుడు మాట్లాడబోను. ఎందుకంటే ఇలాంటి చిల్లర విషయాలపై స్పందించేంత తీరిక నాకు లేదు’ అని వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు