‘అశ్లీల చిత్రాల’ వ్యవహారంలో మరో ట్విస్ట్

14 Nov, 2016 10:44 IST|Sakshi
‘అశ్లీల చిత్రాల’ వ్యవహారంలో మరో ట్విస్ట్

బెంగళూరు: మొబైల్‌లో అశ్లీల చిత్రాలను చూస్తూ అడ్డంగా మీడియాకు దొరికిపోయిన కర్ణాటక ప్రాథమిక శాఖమంత్రి తన్వీర్ సేఠ్‌ వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ తతంగాన్ని చిత్రీకరించిన జర్నలిస్ట్తో పాటు కెమెరామెన్పై మంత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఈ ఫిర్యాదుపై ఓ సీనియర్ పోలీస్ అధికారి మాట్లాడుతూ ఐపీసీ సెక్షన్ 504 కింద టీవీ రిపోర్టర్, కెమెరామెన్ పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

మరోవైపు ఈ వ్యవహారానికి సంబంధించి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ... మొదట నివేదికను పరిశీలించాక దీనిపై విచారణ జరిపించి అనంతరం చర్య తీసుకుంటామన్నారు. అశ్లీల దృశ్యాల వీక్షణపై మంత్రితో మాట్లాడానని, తాను ఏ తప్పు చేయలేదని తన్వీర్ సేఠ్‌ తనతో చెప్పారని ఆయన తెలిపారు. ఒకవేళ తప్పు జరిగితే అది ఎవరు చేసినా తప్పు తప్పేనని సిద్ధరామయ్య అన్నారు. కాగా రాయ్‌చూర్ జిల్లాలో నిర్వహించిన టిప్పుసుల్తాన్ జయంతి సందర్భంగా  గురువారం మంత్రి తన్వీర్ సేఠ్ సెల్‌ఫోన్‌లో అశ్లీల దృశ్యాలు వీక్షిస్తూ మీడియాకు దొరికిపోయిన విషయం తెలిసిందే.

దీంతో తన్వీర్ మంత్రిపదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ.... బీజేపీతో పాటు జేడీఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు.  అయితే తాను ఏ తప్పు చేయలేదని, తాను అమాయకుడినని చెప్పుకొచ్చారు. ఏ తప్పు చేయనప్పుడు రాజీనామా చేయవలసిన అవసరం ఏముంటుందని, మంత్రి పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని తన్వీర్ తేల్చిచెప్పారు.

అలాగే ఈ ఘటనపై మాజీ ప్రధాని దేవగౌడ స్పందిస్తూ... తన్వీర్ వ్యవహారంలో ముఖ్యమంత్రి జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. మొబైల్ లో అభ్యంతరకర ఫోటోలు చూస్తు దొరికిపోయిన మంత్రికి క్లీన్ చిట్ ఇవ్వడం సరికాదని, దీనిపై విచారణకు ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు