రోహిణీలో కిరణ్ బేడీ రోడ్ షో

20 Jan, 2015 00:01 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: రోహిణీలో రోడ్‌షోతో కిరణ్ బేడీ విధానసభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. రోహిణీలోని జపనీస్ పార్కు వద్ద ఈ షో ఆరంభమైంది. సెక్టార్ 7 నుంచి సెక్టార్ 13 వరకు షో జరిగింది. వాస్తవానికి ఈ షో ఆదివారమే జరగాల్సి ఉంది. అయితే అందుకు పోలీసు శాఖ అనుమతి లభించలేదు. సోమవారం అనుమతి లభించడంతో ఈ షోను నిర్వహించారు. ఈ సందర్భంగా కిరణ్ బేడీ మాట్లాడుతూ కేంద్రంలోనూ, ఎమ్సీడీలోనూ, ఢిల్లీలోనూ ఒకే  పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండడం వల్ల జాతీయ రాజధాని నగరం అభివృద్ధి పధంలో పయనిస్తుందన్నారు.
 
 మహిళా భద్రతకే తాను ప్రాధాన్యమిస్తానని చెప్పారు. తమ పార్టీది కూడా అదే విధానమని అన్నారు. కాగా కిరణ్ బేడీ... కమలదళానికి ప్రధాన ప్రచారకర్తగా మారారు. ఆమె నగరంలోని ఏడు లోక్‌సభ నియోజకవర్గాలలో ర్యాలీలు నిర్వహిస్తారని అంటున్నారు. విధానసభ ఎన్నికలకు ప్రచారం చేసే తీరిక ప్రధానికి లేదని అంటున్నారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా... భారత్ సందర్శన, ప్రధాని యుకే పర్యటన కారణంగా జాతీయ రాజధాని నగరంలో విస్తృతంగా ప్రచారం చేసేందుకు తగినంత సమయం నరేంద్రమోదీకి లేదని అంటున్నారు అందువల్ల కిరణ్ బేడీయే ప్రధానాకర్షణగా ప్రచారం జరపాలని కమలదళం నిర్ణయించింది.
 

మరిన్ని వార్తలు