హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిని ఎండగడితేనే ఆ పార్టీని ఓడించగలమని.. పథకాల అమలుపై ఒత్తిడి తెచ్చినా లాభం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. ఆయన గురువారం అసెంబ్లీ లాబీలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘పథకాల అమలుపై ఒత్తిడి తెస్తే లాభం లేదు. ఆదాయం లేదనో.. మరో కారణంతోనే కేసీఆర్ వాటిని దాటవేస్తారు. దానికి బదులు అవినీతి పాలనపై మాట్లాడితే ఫలితముంటుంది. గత మూడేళ్లుగా అవినీతి గురించి అసెంబ్లీలో ప్రస్తావించింది నేనొక్కడినే.
మిషన్ భగీరథలో రూ. 20 వేల కోట్లు కేవలం పైపుల కోనుగోలుకే ఖర్చు చేస్తున్నారు. అందులో 5 శాతం పైపుల కంపెనీ నుంచే కేసీఆర్కు కమీషన్ వస్తోంది. దేశంలో ఐఎస్ఐ బ్రాండ్ కంపెనీలు 14 ఉన్నాయి. అందులో మూడు కంపెనీలనే ఎందుకు ఎంపిక చేసుకున్నారని’’ ప్రశ్నించారు.