జెమినీ గణేశన్‌లో లక్ష్మీమీనన్

30 Nov, 2015 02:26 IST|Sakshi
జెమినీ గణేశన్‌లో లక్ష్మీమీనన్

కోలీవుడ్‌లో లక్కీ హీరోయిన్ అంటే లక్ష్మీమీనన్‌నే. తొలి చిత్రం కుంకీ నుంచి ఇటీవల తెరపైకొచ్చిన వేదాళం వరకూ వరుసగా విజయాలను తన ఖాతాలో వేసుకున్న ఏకైక నటి లక్ష్మీమీనన్. విక్రమ్‌ప్రభు, విమల్ లాంటి వర్ధమాన హీరోలతో అయినా, విశాల్, కార్తీ, అజిత్ లాంటి స్టార్ హీరోలతో అయినా లక్ష్మీమీనన్ నటించిందంటే ఆ చిత్రం హిట్టే అన్నంతగా పేరు సంపాదించుకుందీ మలయాళీ కుట్టి. నటిగా మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు చదువుకోవాలంటూ నటనకు గ్యాప్ ఇచ్చి ప్లస్‌టూ పరిక్షలు రాసి ఉత్తీర్ణురాలైంది.
 
 ఆ గ్యాప్ తన నట జీవితాన్ని దెబ్బ తీస్తుందని ఏమాత్రం భయపడలేదు.అలాగే కథానాయకిగా సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్న సమయంలో వేదాళం చిత్రంలో అజిత్‌కు చెల్లెలిగా నటించే అవకాశం వస్తే వెనుకా ముందు ఆలోచించకుండా ఆ పాత్ర చేయడానికి సమ్మతం చెప్పేసింది. అయినా లక్ష్మీమీనన్ కెరీర్‌కు వచ్చిన డోకా ఏమీలేదు. ఇప్పుడామె హీరోయిన్‌గా బిజీ అవుతోంది. ప్రస్తుతం జయంరవి సరసన మిరుదన్ చిత్రంలో నటిస్తోంది.
 
 కాగా తాజాగా జీవాతో రొమాన్స్ చేసే అవకాశం లక్ష్మీమీనన్‌ను వరించింది. ఇంతకు ముందు ఈ చిత్రంలో నటి తమన్న నటించనున్నట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు నటి లక్ష్మీమీనన్‌ను ఎంపిక చేశారు. పీటీ.సెల్వకుమార్ నిర్మించనున్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు ముత్తుకుమార్ దర్శకత్వం వహించనున్నారు.దీనికి జెమినీగణేశన్ అనే పేరును నిర్ణయించారు.ఇది రొమాంటిక్ ప్రేమ కథా చిత్రం అని అంటున్నారు చిత్ర యూనిట్ వర్గాలు. జీవా ప్రస్తుతం పోకిరిరాజా చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం పూర్తి అయిన తరువాత జెమినీగణేశన్ చిత్రంలో పాల్గొననున్నారు.
 

మరిన్ని వార్తలు