రోడ్డుపైనే తాళి కట్టిన ప్రియుడు

23 Jul, 2014 10:47 IST|Sakshi
రోడ్డుపైనే తాళి కట్టిన ప్రియుడు

చెన్నై : ప్రియురాలిని ఆమె కుటుంబ సభ్యులు తన నుంచి ఎక్కడ దూరం చేస్తారనే భయంతో ఓ ప్రియుడు రోడ్డుపైనే తాళి కట్టేశాడు. ఈ సంఘటన తమిళనాడులోని తంజావూరులో జరిగింది. వివరాల్లోకి వెళితే  ఊటీకి చెందిన దివ్య, ఆనంద్ అదే ప్రాంతంలోని ప్రయివేటు కళాశాలలో ఒకే తరగతిలో చదువుతున్నారు. వారి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ వ్యవహారం దివ్య తల్లిదండ్రులకు తెలియటంతో వారు ఆమెను మందలించారు. అయినా దివ్య తల్లిదండ్రుల మాట వినకపోవటంతో ఆమెను తంజావూరులోని బంధువుల ఇంటికి తీసుకెళ్లి అక్కడ నిర్బంధించారు.

ఈ సమాచారం తెలుసుకున్న ఆనంద్‌ కూడా తంజావూరు వచ్చాడు. దివ్య ఉంటున్న ఇంటికి వెళ్లిన అతడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో దివ్యను తీసుకుని  బస్టాండు చేరుకున్నాడు. అయితే దివ్య ఇంట్లో లేకపోవటంతో ఆమె బంధువులు  వెతుక్కుంటూ బస్టాండ్ చేరుకున్నారు. దీంతో ఆనంద్ దిక్కుతోచని స్థితిలో హఠాత్తుగా రోడ్డుపైనే తను ప్రేయసి మెడలో తాళి కట్టాడు.

ఊహించని ఈ సంఘటనతో బస్టాండులోని ప్రయాణికులు ఆశ్చర్యానికి లోనయ్యారు. కాగా ఆ సమయంలో అక్కడే ఉన్న తంజావూరు వైద్య కళాశాల పోలీసు ఇన్‌స్పెక్టర్ బాలమురుగన్ ఆ ప్రేమజంటను తన జీపులో ఎక్కించుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు. అనంతరం ప్రేమజంటను విచారించిన పోలీసులు....వారిద్దరూ మేజర్లు కావడంతో వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.

మరిన్ని వార్తలు