మాస్తిగుడి కేసు: ఐదుగురి అర్జీలు తిరస్కరణ

19 Aug, 2019 08:06 IST|Sakshi
సినిమా షూటింగ్‌ సమయంలో స్టంట్‌ మాస్టర్లతో మృతులు అనిల్, ఉదయ్‌ (షర్ట్‌లు ధరించని వారు)

దొడ్డబళ్లాపురం : 2016లో కన్నడ సినీ హీరో దునియా విజయ్‌ నటించిన మాస్తిగుడి సినిమా షూటింగ్‌ మాగడి సమీపంలోని తిప్పగొండనహళ్లి డ్యాంలో చేస్తుండగా అనిల్, ఉదయ్‌ అనే ఇద్దరు ఫైటర్లు నీటమునిగి మృతి చెందిన కేసు నుండి తమ పేర్లను తొలగించాలని ఐదుగురు నిందితులు పెట్టుకున్న అర్జీలను రామనగర జిల్లా కోర్టు కొట్టివేసింది. 2016లో నవంబర్‌.7న మాస్తిగుడి సినిమా క్లైమాక్స్‌ షూటింగ్‌ జరుగుతుండగా హెలికాప్టర్‌ నుండి డ్యాంలోకి పడ్డ ఇద్దరు విలన్‌ పాత్రధారులు ఉదయ్, అనిల్‌ నీట మునిగి మృతి చెందారు. ఇదే సమయంలో వారితోపాటు డ్యాంలో పడ్డ హీరో విజయ్‌ను అక్కడున్నవారు రక్షించారు.

ఘటనకు సంబంధించి తావరెకెరె పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆరుగురిపై కేసు నమోదు చేశారు. వీరిలో హెలికాప్టర్‌ నడుపుతున్న ప్రకాశ్‌ బిరాదార్‌ పేరును కోర్టు తొలగించింది. బిరాదార్‌ తరఫు లాయర్‌ దిలీప్‌ ఈ ఘటనలో బిరాదార్‌ తప్పు ఏమాత్రం లేదని అతడి పేరు కేసు నుండి తొలగించాలని వాదించారు. దిలీప్‌ వాదనలతో ఏకీభవించి కోర్టు బిరాదార్‌ పేరు తొలగించింది. చిత్రం నిర్మాత సుందర్‌ పి.గౌడ, డైరెక్టర్‌ రాజశేఖర్,సిద్ధార్థ్‌ ఆలియాస్‌ సిద్ధు, స్టంట్స్‌ డైరెక్టర్‌లయిన రవివర్మ, భరత్‌రావ్‌లు ఐదుగురు తమను కూడా కేసు నుండి విముక్తులను చేయాలని అర్జీ పెట్టుకున్నప్పటికీ రామనగర జిల్లా అడిషనల్‌ సెషన్స్‌ కోర్టు శనివారం సాయంత్రం వాటిని కొట్టివేసింది. 

మరిన్ని వార్తలు