సాక్షి, ముంబై: కరోనా మహమ్మారి బారిన పడుతున్న వారి సంఖ్య మన దేశంలో 5 వేలకు చేరువయింది. మహారాష్ట్రలో కోవిడ్-19 బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మంగళవారం ఒక్కరోజే మహారాష్ట్రలో 150 కరోనా పాజిటివ్ కేసులు నమోద కాగా, ఒక్క ముంబైలోనే 116 కేసులు వెలుగులోకి వచ్చాయి. మహారాష్ట్రలో మొత్తం ఇప్పటివరకు 1,018 మందికి కరోనా సోకినట్టు వైద్యశాఖ అధికారులు ప్రకటించారు. అంతేకాదు దేశంలో వెయ్యి కరోనా పాజిటివ్ కేసులు నమోదైన తొలి రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచిందని వెల్లడించారు. (క్వారంటైన్లోకి సీఎం భద్రతా సిబ్బంది)
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు కోవిడ్-19 కారణంగా 64 మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపారు. మంగళవారం ఒక్కరోజే 12 మంది మరణించారు. ఒక్క ముంబైలోను 40 మంది చనిపోయినట్టు బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) ప్రకటించింది. మృతుల్లో ఒకరికి మాత్రమే అమెరికా ప్రయాణ చరిత్ర ఉంది. మిగతా వారికి ప్రయాణ చరిత్ర లేదని, వారంతా 50 ఏళ్లు పైబడిన వారని.. మధుమేహం, హైపర్ టెన్షన్ వంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయని వెల్లడించారు. ముంబైలో కొత్తగా నమోదైన 116 కరోనా పాజిటివ్ కేసులతో పాటు పుణెలో 18.. అహ్మద్నగర్, నాగపూర్, ఔరంగాబాద్లతో మూడేసి చొప్పున కోవిడ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. థానే, బల్డానా ప్రాంతాల్లో ఇద్దరిద్దరికి కోవివ్ సోకినట్టు అధికారులు తెలిపారు.