ప్రేమలో ఓడి‘పోయాడు’

14 Jan, 2014 00:21 IST|Sakshi

ప్యారిస్, న్యూస్‌లైన్: ఓ యువకుడు ప్రేమలో ఓడిపోయి బలవన్మరణానికి గురయ్యాడు. కోయంబత్తూరు త్యాగి కుమరన్ వీధిలో దేవరాజ్ నగల వర్క్‌షాపును నడుపుతుండేవాడు. ఈ వర్క్‌షాపులో పాలక్కాడు కుళల్‌మన్నం సమీపంలోని సెంగనూర్‌కు చెందిన ప్రదీష్ (24) పది సంవత్సరాలుగా పనిచేస్తూ వస్తున్నాడు. ఇతను సెంగరూర్‌కు చెందిన ఓ యువతితో స్నేహంగా ఉంటూ వచ్చాడు. ఆపై వారి స్నేహం ప్రేమగా మారింది. వీరి ప్రేమకు ఇరు కుటుంబాల వారు అంగీకరించలేదు. దీంతో వారు ఎవరికీ తెలియకుండా ప్రేమ వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రదీష్ పది రోజులు సెలవు పెట్టి సొంత ఊరికి వెళ్లాడు. వీరిద్దరూ రహస్య వివాహం చేసుకుంటారని భావించి యువతి తల్లిదండ్రులు ఆమెను వారి బంధువుల ఇంటికి పంపించేశారు.
 
 ప్రియురాలు ఎక్కడికెళ్లిందో తెలియక ప్రదీష్ తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. వారం రోజుల పాటు మతి భ్రమించిన వాడి వలే గ్రామంలో తిరిగాడు. ఈ స్థితిలో శనివారం రాత్రి ప్రదీష్‌కు ఫోన్ వచ్చింది. తనను మరచిపోవాలని, తన బంధువుల ఇష్టప్రకారమే నడుచుకుంటానని ప్రియురాలు తేల్చిచెప్పింది. మనస్తాపం చెందిన ప్రదీప్ ఆదివారం కోవైకు తిరిగి వచ్చాడు. వర్క్‌షాపులో ఉన్న సైనైడ్‌ను తిని తనువుచాలించాడు. చనిపోయే ముందు ప్రదీష్  తన స్నేహితుడికి ఫేస్‌బుక్‌లో మెసేజ్ పంపాడు. అందులో తాను మోసపోయానని, అమ్మాయిలను నమ్మొద్దు, నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను, నన్ను క్షమించండి అని పోస్టింగ్ చేశాడు. సమాచారం అందుకున్న వెరైటీ హాల్ రోడ్డు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రదీష్ మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
 
 

మరిన్ని వార్తలు