రెండేళ్ల బాలుడిని కదిలే రైల్లో నుంచి విసిరేసి..

8 Jul, 2016 16:47 IST|Sakshi

ముంబై: రెండేళ్ల బాలుడిని ఓ కసాయి తండ్రి కదిలే రైల్లో నుంచి కిందకు విసిరేసిన దారుణ సంఘటన ముంబైలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖదీర్ ఖాన్ (40), సమీనా ఖాన్ (32) దంపతులు రంజాన్ సందర్భంగా వారం క్రితం నగరంలోని చౌకీ మొహల్లా నివాసం ఉంటున్న బంధువుల ఇంటికి వచ్చారు.

వీరికి ఐదుగురు కూతుళ్లతో పాటు రెండేళ్ల కొడుకు కైఫ్ ఉన్నాడు. మంగళవారం మధ్యాహ్నం సమీనా బంధువులతో మాట్లాడుతూ కైఫ్ పిల్లలతో ఆడుకుంటున్నాడనుకుని పట్టించుకోకుండా వదిలేసింది. కాసేపటి తర్వాత కైఫ్ కోసం ఇల్లంతా వెతికినా కనిపించకపోవడంతో భర్తకు ఫోన్ చేసింది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఖదీర్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో జేజే మార్గ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఆ తర్వాత సమీనాకు ఫోన్ చేసిన ఖదీర్... తానే కైఫ్ ను బైకుల్లా దగ్గరలో కదిలే రైల్లో నుంచి కిందకు విసిరేసినట్లు చెప్పాడు. ఖదీర్ చెప్పిన సమాచారాన్ని సమీనా పోలీసులకు చేరవేసింది. రంగంలోకి దిగిన అధికారులు రైల్వే పోలీసుల సాయంతో రైల్వే ట్రాక్ వద్ద బిడ్డ శవాన్ని కనుగొన్నారు. నిందితుడి ఆచూకీ లేకుండా పోవడంతో అతని కోసం గాలింపు ప్రారంభించారు.

మరిన్ని వార్తలు