5 పైసలకు చెక్కు ఇచ్చాడు

21 Mar, 2017 20:09 IST|Sakshi



మైసూరు: కోట్ల రూపాయల ఎగవేసే బడాబాబులతో మహా మర్యాదగా ప్రవర్తించే బ్యాంకులు సామాన్యులతో మాత్రం రూల్స్‌ రూల్సే అంటాయి. అణా పైసలతో సహా చెల్లిస్తే గానీ పనులు చేయవు. ఇలాంటిదే ఈ విడ్డూరపు ఘటన. క్రెడిట్‌కార్డు సేవలను నిలిపివేయడానికి ఎస్‌బీఐ ఖాతాదారు నుంచి ఐదు పైసలు చెక్‌ను తీసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

మైసూరు నగరంలోని విజయనగర్‌కు చెందిన సతీష్‌ ఐదేళ్ల క్రితం రూ.25 వేలు డిపాజిట్‌ కట్టి ఎస్‌బీఐ నుంచి క్రెడిట్ కార్డు పొందారు. అయితే కార్డు బిల్లులు భరించలేక ఆయన కార్డును బ్లాక్‌ చేయడానికి నిర్ణయించుకున్నారు. దీంతో బ్యాంకు అధికారులకు విషయం తెలపడంతో కార్డు లావాదేవీలను పరిశీలించిన వారు కార్డు బిల్లుకు సంబంధించి ఇంకా ఐదు పైసలు బాకీ ఉన్నారని ఐదు పైసలు చెల్లిస్తేనే క్రెడిట్‌కార్డు సేవలను స్తంభింపచేస్తామని చెప్పారు. అయితే మొదట్లో బ్యాంకు అధికారులు తనను ఆటపట్టిస్తున్నారనుకున్న సతీష్‌ మరోసారి కార్డును బ్లాక్‌ చేయాలని కోరినా అదే సమాధానం ఎదురైంది. అయితే ఎప్పుడో చలామణిలో లేకుండా పోయిన ఐదు పైసలను ఎక్కడి నుంచి తేవాలో తెలియక సతమతమవుతున్న సతీష్‌కు చెక్‌ ద్వారా ఆ బకాయిని చెల్లించవచ్చని బ్యాంకు అధికారులు సూచించారు. దీంతో ఐదు పైసలకు చెక్‌ రాసిచ్చారు. ఇందుకు తనకు రూ.3 ఖర్చయినట్లు సతీష్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు