ప్రియురాలు పెళ్లికి అంగీకరించలేదని..

20 Jul, 2017 15:52 IST|Sakshi
ప్రియురాలు పెళ్లికి అంగీకరించలేదని..
► ప్రేమించి పెళ్లి వద్దన్నందుకు యువతి దారుణహత్య
► అనంతరం పోలీస్‌స్టేషన్‌లో ఆత్మహత్యకు పాల్పడిన యువకుడు
► యువకుడి గుడిసెకు నిప్పు పెట్టిన గ్రామస్తులు
 
తిరువణ్ణామలై(చెన్నై): ప్రేమించిన ప్రియురాలు పెళ్లికి అంగీకరించలేదని ఆగ్రహించిన ప్రియుడు ఆమెను కిరాతకంగా హతమార్చాడు. అనంతరం పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయి ఆత్మహత్యకు యత్నించాడు. తిరువణ్ణామలై జిల్లా ఆరణి తాలుకా మలయంబట్టు కాలనీకి చెందిన మాజీ సైనికుడు మది అయగన్‌ కుమార్తె మోనిక(20) కాట్పాడిలోని అగ్జిలియం కళాశాల్లో బీఏ  తృతీయ సంవత్సరం చదువుతూ అక్కడే వసతి గృహంలో ఉంటోంది.

ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో ఆరణి సమీపం ఈచతాంగాంల్‌ చెరువులో రక్తపు మడుగులో యువతి మృతి చెంది ఉండటాన్ని గమనించిన స్థానికులు ఆరణి తాలుకా పోలీసులకు సమాచారం తెలిపారు. డీఎస్పీ జరీనాబేగం, పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. మృతదేహం వద్ద యువతి కళాశాల గుర్తింపు కార్డు లభించింది. కళాశాల నిర్వాహకులను ఫోన్‌లో సంప్రదించగా మోనిక మంగళవారం కళాశాలకు రాలేదని తెలిసింది. దీంతో మోనిక స్నేహితుల వద్ద పోలీసులు విచారణ జరిపారు.

ఇదిలాఉండగా రాత్రి 10 గంటల సమయంలో ఆరణి తాలుకా పూంగాంబాడి గ్రామానికి చెందిన గోకుల్‌నాథ్‌ ఈ హత్య చేసినట్లు పోలూరు పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. విచారణలో ఇతడు బెంగళూరులో కూలీ పనులు చేస్తున్నట్లు పాఠశాల సమయం నుంచే మోనికను ప్రేమిస్తున్నట్లు తెలిపాడు. తాము ఫోన్‌లో తరచూ మాట్లాడుకుంటున్నామని వివాహం చేసుకునేందుకు మోనిక తల్లి దండ్రుల వద్ద కోరగా వారు అంగీకరించలేదని తెలిపాడు. అనంతరం మోనిక గోకుల్‌నాథ్‌ను దూరం పెట్టడంతో మంగళవారం స్నేహితురాలి ద్వారా ఫోన్‌లో మాట్లాడి ఆమెను చెరువు వద్దకు రప్పించి పెళ్లికి అంగీకరించాలని కోరాడు. మోనిక పెళ్లికి తిరస్కరించడంతో ఆగ్రహించిన గోకుల్‌నాథ్‌ కత్తితో దారుణంగా హత్య చేసి పరారైనట్లు తెలిపాడు. 
 
పోలీస్‌స్టేషన్‌లో ఆత్మహత్యాయత్నం : 
అనంతరం పోలూరు పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయిన గోకుల్‌నాథ్‌ను అరణి పోలీసులకు అప్పగించే సమయంలో తన వద్ద ఉన్న కత్తితో పొడుచుకుని ఆత్మహత్యకు యత్నించాడు. పోలీసులు అతన్ని అడ్డుకుని వేలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. బుధవారం ఉదయం 6 గంటలకు రహస్య ప్రాంతానికి తీసుకెళ్లి విచారణ చేపట్టారు. 

యువకుడి గుడిసెకు నిప్పు:
మోనికను హత్యచేసిన విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆగ్రహించి  గోకుల్‌నాథ్‌ ఇంటి ఆవరణలోని గుడిసెకు నిప్పు పెట్టారు. అనంతరం ఇంట్లో ఉన్న వస్తువులను ధ్వంసం చేసి బయట పడవేశారు.  
 
మరిన్ని వార్తలు