కట్టుకున్నోడే కాలయముడు!

23 Aug, 2017 11:13 IST|Sakshi
కట్టుకున్నోడే కాలయముడు!
► తన పేరుపై స్థలం రాసివ్వలేదని కిరాతకుడి ఘాతుకం 
► బెంగళూరులో ఘటన
కర్ణాటక: ఆస్తి, డబ్బు విషయంలో గొడవపడి ఓ వ్యక్తి తన భార్యను హత్య చేసిన సంఘటన శ్రీరాంపుర పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాలు...  హనుమంతనగర నివాసి జానకి జ్యోతి (35)కి, శ్రీరాంపుర నైస్‌రోడ్డులో నివాసముంటున్న చంద్రశేఖర్‌తో 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఫ్లవర్‌ డెకరేషన్‌ పనులు చేసే చంద్రశేఖర్‌ దంపతులకు నలుగురు సంతానం. ఇద్దరు మగ, ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. నాలుగేళ్లుగా దంపతుల మధ్య ఆస్తి విషయంలో గొడవలు వచ్చాయి. విడాకుల కోసం కోర్టుకు వెళ్లారు. అయినా కూడా కలిసే ఉంటున్నారు.

భార్య పేరుమీద ఉన్న స్థలాన్ని తనకు రాసివ్వాలని జానకిని పీడించేవాడు. ఇదే విషయపై దంపతులు పలుమార్లు గొడవపడేవారు. సోమవారం రాత్రి మరోసారి స్థలం విషయంలో ఘర్షణ జరిగింది. అది తీవ్రస్థాయికి చేరడంతో ఆగ్రహానికి గురైన చంద్రశేఖర్‌ పిల్లలు నిద్రలోకి జారుకున్న తరువాత భార్య గొంతుకు తాడు బిగించి హత్య చేసి ఉడాయించాడు. మంగళవారం తెల్లవారుజామున నిద్రలేచిన ఓ చిన్నారి అచేతనంగా  పడి ఉన్న తల్లి వద్ద రోదిస్తుండటంతో  మిగతా పిల్లలు లేచారు. చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. శ్రీరామ్‌పుర పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.  
మరిన్ని వార్తలు