డ్రైవర్ రైలు ఆపడంతో తప్పిన ప్రమాదం
చెన్నై,తిరువొత్తియూరు: తిరుచ్చిలో ఓ యువకుడు మద్యం మత్తులో కదులుతున్న రైలుకు ఎదురెళ్లాడు. అయితే డ్రైవర్ రైలును ఆపడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. తిరుచ్చి జంక్షన్ రైల్వేస్టేషన్ నుంచి చెన్నై తేజస్ ఎక్స్ప్రెస్ రైలు మంగళవారం సాయంత్రం 4.55 గంటలకు కదిలింది. రైలు నెమ్మదిగా కదులుతున్న సమయంలో హఠాత్తుగా ఓ వ్యక్తి (35) పట్టాలపైకి వచ్చి రైలుకు అడ్డుగా నిలబడ్డాడు. అది చూసిన డ్రైవర్ హారన్ మోగించినప్పటికీ అతడు కదలలేదు. దీంతో డ్రైవర్ రైలును నిలిపి వేయడంతో అతడు ప్రాణగండం నుంచి బయటపడ్డాడు. దీనిపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు అతడిని పట్టాల మీద నుంచి పక్కకు తప్పించారు. విచారణలో అతడు మద్యం తాగిన మైకంలో ఉన్నట్టు తెలిసింది. ఈ ఘటనతో ఆ రైలు 10 నిమిషాలు ఆలస్యంగా నడిచింది.