దోషులెవరు?

1 Apr, 2014 01:04 IST|Sakshi
  • సామూహిక హత్యలు - ఆత్మహత్య కేసు సీఐడీకి..?
  •  హైదరాబాద్ పోలీసు అధికారి పాత్రపై ఆరా
  •  సాక్షి ప్రతినిధి, బెంగళూరు : నగర శివార్లలోని రామనగర జిల్లా తలఘట్టపుర వకీల్ గార్డెన్‌లో చోటు చేసుకున్న సామూహిక హత్యలు - ఆత్మహత్య సంఘటనపై సీఐడీ దర్యాప్తు చేయించాలని పోలీసు శాఖ నిర్ణయించింది. ఈ దారుణ కృత్యానికి హైదరాబాద్ సిటీ క్రైం స్టేషన్ పోలీసు అధికారి ‘రెడ్డి’ వేధింపులే కారణమనే ఆరోపణలు వస్తుండండతో సీఐడీ దర్యాప్తునకు ఆదేశాలు వెలువడినట్లు సమాచారం.

    కౌశిక్ పునీత్ శర్మ (40) అనే వ్యక్తి తన నివాసంలో భార్య శ్రీలత (36), కుమార్తె శ్రీరక్ష (11), కుమారుడు కౌస్తుభ (9)లను విష ప్రయోగం ద్వారా చంపి, తదనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. గురువారం రాత్రి ఈ సంఘటన జరుగగా, శుక్రవారం మధ్యాహ్నం వెలుగు చూసింది. ఈ దారుణానికి ఎందుకు పాల్పడాల్సి వచ్చిందో వివరిస్తూ... శర్మ రెండు డెత్ నోట్‌లను రాసి పెట్టారు. తన వద్ద ఉన్న నగలతో పాటు ఆస్తిని కాజేయడానికి రెడ్డి స్థానిక గూండాల ద్వారా పలు సార్లు వేధింపులకు పాల్పడ్డాడని ఓ డెత్ నోట్‌లో పేర్కొన్నట్లు తెలిసింది.

    పోలీసు అధికారి ప్రమేయం ఉందని రాష్ట్ర పోలీసులకు కూడా అనుమానం కలగడంతో సీఐడీ దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలుస్తోంది. పైగా ఇరు రాష్ట్రాల పోలీసులు ఈ మిస్టరీని ఛేదించాల్సి ఉన్నందున, సీఐడీ దర్యాప్తు ఉత్తమమని రాష్ట్ర పోలీసు అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. వృతులు వదిలి వెళ్లిన డెత్ నోట్లు, ఇతర వస్తువులు తమ స్వాధీనంలో ఉన్నాయని రామనగర ఎస్‌పీ అనుపమ్ అగర్వాల్ తెలిపారు. వృతుల పక్కన పడి ఉన్న సిరంజిలు, బాటిళ్లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు వెల్లడించారు.

    సూసైట్ నోట్‌లను చేతి రాతల నిపుణుల పరిశీలన కోసం పంపామని చెప్పారు. కాగా రెడ్డి, శర్మల మధ్య ఉన్న సంబంధాలు, వేధింపులకు కారణాలు దిశగా తమకు ఇంకా కచ్చితమైన వివరాలు లభ్యం కాలేదని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న రామనగర పోలీసులు తెలిపారు. ఉడిపికి చెందిన శర్మ అమెరికాలో అనేక సంవత్సరాలు పని చేసి, మూడేళ్ల కిందట బెంగళూరులో స్థిరపడ్డారు. రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ వ్యాపారాలు చేస్తున్నారు.
     

మరిన్ని వార్తలు