టీ20 భారత మహిళా జట్టుకు మేఘన ఎంపిక

31 Oct, 2016 22:14 IST|Sakshi
టీ20 భారత మహిళా జట్టుకు మేఘన ఎంపిక

విజయవాడ స్పోర్ట్స్‌ : దేశవాళీ క్రికెట్‌లో విశేషంగా రాణిస్తున్న కృష్ణా జిల్లా మహిళా క్రికెటర్‌ సబ్బినేని మేఘన భారత జట్టుకు ఎంపికైంది. ఈ నెల 16వ తేదీ నుంచి మూలపాడు ట్విన్‌ గ్రౌండ్స్‌లో వెస్టిండీస్‌ జట్టుతో జరిగే 3 ఇంటర్నేషనల్‌ టీ20 మ్యాచ్‌లతో పాటు థాయిలాండ్‌లో జరిగే ఏషియా కప్‌లో పాల్గొనే   భారత జట్టుకు మేఘన ప్రాతినిధ్యం వహిస్తుంది.

డాషింగ్‌ బ్యాట్స్‌ఉమెన్‌గా పేరున్న ఆమె 2014లో ఆస్ట్రేలియాతో జరిగిన ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో బోర్డు  ప్రెసిడెంట్స్ ఎలెవన్‌లో ఆడింది. ఆంధ్ర మహిళా క్రికెట్‌ నుంచి గతంలో వి.స్నేహదీప్తి, ఆర్‌.కల్పన భారత జట్టుకు ఆడారు. ఇప్పుడు మేఘన ఎంపికైంది. అండర్‌–16, అండర్‌–19, ఆంధ్ర సీనియర్‌ ఉమెన్‌ జట్టుల్లో కీలకమైన ప్రధాన బ్యాట్స్‌ఉమెన్‌గా తన కెరీర్‌ను కొనసాగిస్తోంది. అన్ని ఏజ్‌ గ్రూపుల్లో ఆంధ్ర జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించింది. ప్రతి ఏడాది జోనల్‌ క్రికెట్‌ అకాడమీ, నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలు నిర్వహించే క్యాంపుల్లో పాల్గొంది. గుంటూరు జేకేసీ కళాశాలలోని ఏసీఏ మహిళా క్రికెట్‌ అకాడమీలో శిక్షణ పొందుతోంది. వెస్టిండీస్‌తో జరిగే టి20 మ్యాచ్‌లతో పాటు ఏషియా క్రికెట్‌ కప్‌లో పాల్గొనే భారత జట్టుకు ఎంపికైన సందర్భంగా బీసీసీఐ ఉపాధ్యక్షుడు గోకరాజు గంగరాజు, ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షడు డి.వి.ఎస్‌.ఎస్‌.సోమయాజులు, ఏసీఏ మహిళా క్రికెట్‌ విభాగం చైర్మన్‌ జె.మురళీమోహన్‌ అభినందనలు తెలిపారు. 

మరిన్ని వార్తలు