ప్రధాని జోక్యం చేసుకోవాలి

18 Jun, 2015 04:15 IST|Sakshi
ప్రధాని జోక్యం చేసుకోవాలి

 గాలింపును తీవ్రతరం చేయాలి
 కోస్ట్‌గార్డ్ విమాన అధికారుల
 సతీమణులు వినతి

 చెన్నై, సాక్షి ప్రతినిధి: కోస్ట్‌గార్డ్ విమానం గల్లంతై పదిరోజులైనా  అచూకీ లేనందున ప్రధాని నరేంద్రమోదీ జోక్యం చేసుకోవాలని అదే విమానంలో ప్రయాణించిన అధికారుల సతీమణులు బుధవారం విజ్ఞప్తి చేశారు.చెన్నై కోస్ట్‌గార్డ్ విమానం ఈనెల 8వ తేదీ రాత్రి  చెన్నై నుంచి పుదుచ్చేరికి బయలుదేరి తిరుగు ప్రయాణంలో గల్లంతైన సంగతి పాఠకులకు విదితమే. ఆ విమానంలో సుభాష్ సురేష్, సోనీ, విద్యాసాగర్ అనే అధికారులు ప్రయాణిస్తున్నారు. ఈ ముగ్గురి ఆచూకీ లేదు. అదే రోజు రాత్రి 9.23 గంటల సమయంలో శీర్కాళీ-చిదంబరం మద్య ప్రయాణిస్తుండగా చివరిసారిగా సిగ్నల్ అందుకున్నట్లు నిర్ధారణకు వచ్చిన అధికారులు ఆ ప్రాంతంలో గాలిస్తున్నారు.
 
  గత పదిరోజులుగా తీవ్రస్థాయిలో గాలిస్తున్నా విమానం ఆచూకీ లభించలేదు. మూడురోజుల క్రితం జరిపిన గాలింపులో కూలిపోయిన విమానం బ్లాక్‌బాక్స్ నుండి సిగ్నల్స్ తగిలాయి. అయితే అవి స్పష్టంగా లేకపోవడం, తరచూ కట్ కావడంతో గాలింపు చర్యల్లో గందరగోళం నెలకొంది. గాలింపు వివరాలను గల్లంతైన అధికారుల కుటుంబాలకు అధికారులు ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉన్నారు. అయితే పదిరోజుల పాటూ భర్తల కోసం నిరీక్షించిన వారి సతీమణులు బుధవారం ప్రధానికి తమ గోడును వినిపించుకున్నారు. భారత సైన్యం పనితీరుపై తమకు ఎంతో నమ్మకం, గౌరవం ఉందని చెప్పారు.
 
  అయితే విమానం గల్లంతైన రాత్రి నుండి తమ భర్తల కోసం ఎదురుచూస్తూ నిద్రలేకుండా గడుపుతున్నామని వారు చెప్పారు. ప్రధానిగా ప్రత్యక్ష జోక్యం చేసుకోవడం వల్ల గాలింపు చర్యల్లో మరింత వేగం సాధ్యమని విద్యాసాగర్ భార్య సుష్మా తవాలా, సోని భార్య అమృత  విన్నవించారు. పెలైట్ సుభాష్ సురేష్ భార్య దీపలక్ష్మి సైతం ప్రధానికి ట్వీట్ చేశారు. ‘ నా దైవ భక్తి వృథాపోదు, భర్త ఖచ్చితంగా ప్రాణాలతో తిరిగి వస్తాడు. నాకు ఆ నమ్మకం ఉంది. ఏడాదిన్నర వయస్సున్న కుమారుడు ఇషాన్‌ను సైతం పెలైట్ చేయాలన్నదే సుభాష్ డ్రీమ్. కోస్ట్‌గార్డ్ విమాన గాలింపు వివరాలను ఎప్పటికప్పుడు బహిరంగ పరిస్తే పనుల్లో వేగం సాధ్యమవుతుందని ఆమె ప్రధానికి విన్నవించారు.
 

మరిన్ని వార్తలు