ఎడ్డెమంటే తెడ్డెం అంటే ఎలా?

20 Feb, 2017 01:18 IST|Sakshi
ఎడ్డెమంటే తెడ్డెం అంటే ఎలా?

ఉత్తమ్, జానాలపై ఎంపీ కవిత విసుర్లు

మిర్యాలగూడ: ప్రభుత్వం పట్ల పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డిలు తమ వైఖరి మార్చుకోవాలని టీఆర్‌ఎస్‌ ఎంపీ కె.కవిత సూచించారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఎంతో అభివృద్ధి జరుగుతోందని, అయినా జానా, ఉత్తమ్‌లు ఎడ్డెం అంటే తెడ్డెం అంటే ఎలా అని ప్రశ్నించారు. ఆదివారం మిర్యాలగూడలో ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే భాస్కర్‌రావులతో కలసి ఆమె విలేకరులతో మాట్లాడారు. అభివృద్ధి విషయంలో ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన పెద్దలు విమర్శించడం సరికాదన్నారు.

వేలాది ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడుతుంటే పూర్తి సమాచారం తెలుసుకోకుండానే ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. వారి వైఖరి మార్చుకొని ప్రభుత్వానికి మంచి సలహాలు ఇవ్వాలని కోరారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలో యాదాద్రి థర్మల్‌ ప్లాంట్‌ నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు. థర్మల్‌ ప్లాంట్‌ నిర్మాణం పూర్తయితే నల్లగొండ తెలంగాణకే ఒక కలికితురాయిగా ఉంటుందన్నారు. అదే విధంగా తెలంగాణ రాకముందు ఎత్తిపోతల పథకాలకు 16 గంటలు కరెంటు ఇస్తే ప్రస్తుతం 24 గంటల పాటు కరెంటు అందిస్తున్నట్లు తెలిపారు. చివరి రైతులకు కూడా సాగు నీరందించడానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని చెప్పారు. రైతులకు ఉచితంగా 9 గంటల పాటు విద్యుత్‌ అందిస్తున్నట్లు కవిత తెలిపారు.

మరిన్ని వార్తలు