'వెంటాడి అర్థరాత్రి నా తలుపు కొట్టాడు'

8 Aug, 2017 19:04 IST|Sakshi
'వెంటాడి అర్థరాత్రి నా తలుపు కొట్టాడు'

ముంబయి: హరియాణాకు చెందిన యువతి వర్ణికా కుందును ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్‌ కుమారుడు వేధించిన సంఘటన సంచనలం సృష్టిస్తుండగా మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తనను కారులో వెంబడించడమే కాకుండా ఇంటి వరకు వచ్చి అర్థరాత్రి 2గంటలకు తలుపు కొట్టాడని అదితి నాగ్‌పౌల్‌ అనే ఫ్యాషన్‌ డిజైనర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఇద్దరు పిల్లలతో కలిసి వస్తుండగా అతడు వెంబడించాడని, అతడి కళ్లల్లో ఏ మాత్రం భయం కనిపించలేదని ఆమె ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు.

అనంతరం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా సీసీటీవీ ఫుటేజీ పరిశీలించిన పోలీసులు దాని ఆధారంగా ప్రత్యేక టీంలు ఏర్పాటుచేసి సదరు వ్యక్తిని అరెస్టు చేశారు. ఆ వ్యక్తి ఓ ఐటీ ప్రొఫెషనల్‌ అని, నితేశ్‌ కుమార్‌ శర్మ(36) అనే వ్యక్తిగా తాము గుర్తించామని తెలిపారు. సీసీటీవీలో రికార్డయిన వీడియోల ప్రకారం మలాద్‌ ప్రాంతానికి శర్మ అర్ధరాత్రి 2గంటల ప్రాంతంలో అదితి డోర్‌ బెల్‌ కొట్టాడని, ఆ తర్వాత సీసీటీవీ కెమెరాను గుర్తించి కొంచెం దూరంగా వెళ్లి నిల్చొని వెళ్లిపోయాడని, అతడు మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. ప్రస్తుతానికి అతడిని అరెస్టు చేసిన పోలీసులు విచారిస్తున్నారు. ఈ సందర్భంగా ముంబయి పోలీసులకు హ్యాట్సాప్‌ అంటూ ఆమె అతడి అరెస్టుకు సంబంధించిన ఓ వీడియోను తాజాగా ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు.

మరిన్ని వార్తలు