శరత్‌కుమార్, రాధారవి సస్పెన్షన్

13 Sep, 2016 08:29 IST|Sakshi
శరత్‌కుమార్, రాధారవి సస్పెన్షన్

చెన్నై: దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం నుంచి ఆ సంఘం మాజీ అధ్యక్షుడు శరత్‌కుమార్, మాజీ కార్యదర్శి రాధారవి, మాజీ కోశాధికారి వాగా చంద్రశేఖర్‌లను సస్పెండ్ చేసినట్లు సంఘ నిర్వాహకులు అధికారికంగా వెల్లడించారు. ఇందుకు సంబంధించి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
 
ముందుగా చెప్పినట్లే సంఘ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని ముఖ్య నిర్ణయాలను తీసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని, అందులో భాగంగా తాము నిర్వహించిన శోధనల్లో గత సంఘం నిర్వాహకం చేసిన పలు అవకతవకలు, అవినీతి వెలుగులోకి వచ్చాయని, వీటి గురించి పలు మార్లు కార్యవర్గ సమావేవంలో చర్చించి నిర్ణయాలు తీసుకున్నట్లు నడిగర్ సంఘం పేర్కొంది.
 
 అందులో భాగంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నామని, సంఘ విధి విధానాల పరంగా జరిగిన అవకతవకలపై విచారణలో నిజానిజాలు బయటపడతాయని తెలిపింది. అంత వరకూ మాజీ సంఘం నిర్వాహకులు శరత్‌కుమార్, రాధారవి, వాగా చంద్రశేఖర్‌ల సంఘ సభ్యత్వంను తాత్కాలికంగా రద్దు చేసినట్లు వెల్లడించింది. అవకతవకలపై కోర్టు తీర్పు అనంతరం తదుపరి చర్యలు ఉంటాయని తెలపింది.

 

మరిన్ని వార్తలు