నళిని నిరాహార దీక్ష విరమణ

19 Jun, 2017 08:33 IST|Sakshi

వేలూరు (తమిళనాడు): వేలూరు మహిళా జైలులో గత ఐదు రోజులుగా నిరాహార దీక్షలో ఉన్న నళిని ఆదివారం దీక్ష విరమించారు. మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ హత్య కేసులో వేలూరు మహిళా జైలులో నళిని, పురుషుల జైలులో మురుగన్, శాంతన్, పేరరివాలన్‌ శిక్ష అనుభవిస్తున్న విషయం విదితమే. అయితే తనను చెన్నై పుళల్‌ జైలుకు మార్చాలని ఈ నెల 12వ తేదీన నళిని జైలు అధికారులకు వినతి పత్రం అందజేశారు.

లండన్‌లో ఉన్న తన కుమార్తెకు వివాహ ఏర్పాట్లు చేస్తున్నామని, తనను పుళల్‌ జైలుకు మార్చితే ఏర్పాట్లపై సమీపంలో నివాసం ఉంటున్న తన బంధువులతో మాట్లాడుకోవచ్చని ఆమె వినతిలో పేర్కొన్నారు. అయితే వినతి పత్రాన్ని స్వీకరించిన అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదంటూ ఈ నెల 14వ తేదీ నుంచి నళిని నిరాహార దీక్ష చేపట్టారు. దీంతో పుళల్‌ జైలుకు మార్చాలన్న వినతిపై చర్యలు తీసుకుంటామని ఆదివారం జైలు అధికారులు హామీ ఇవ్వడంతో నళిని ఆహారం తీసుకున్నారు.

మరిన్ని వార్తలు