నాది సహజ సౌందర్యం

3 Dec, 2014 02:21 IST|Sakshi
నాది సహజ సౌందర్యం

 నాది సహజ సౌందర్యం అంటున్నారు నటి శ్రుతిహాసన్. ఐరన్‌లెగ్ నటి అన్న నోళ్లను అతి త్వరలోనే మూయించి టాప్ హీరోయిన్ అనిపించుకునే స్థాయికి ఎదిగిన నటి ఈమె. తమిళం, తెలుగు, హిందీ భాషల దర్శక నిర్మాతలు శ్రుతిహాసన్ కాల్‌షీట్స్ కోసం క్యూలో నిలబడుతున్నారు. తాజాగా తమిళంలో పూజై చిత్రంతో విజయాల ఖాతాను ప్రారంభించిన ఈ బ్యూటీ ప్రస్తుతం విజయ్ సరసన మారిశన్ చిత్రంలో నటిస్తున్నారు.
 
 అదే విధంగా తెలుగులో మహేష్‌బాబు సరసన ఒక చిత్రంతో పాటు హిందీలో ఏకంగా ఐదు చిత్రాలు చేస్తూ బిజీబిజీగా ఉన్నారు. విజయ్‌తో నటిస్తున్న చిత్ర షూటింగ్ నగరం శివారు ప్రాంతం వీసీఆర్ రోడ్డులో జరుగుతోంది. అయినా తన గ్లామరస్ నటనతోనే శ్రుతిహాసన్ టాప్ హీరోయిన్ స్థాయికి చేరుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ ముద్దుగుమ్మను స్ఫూర్తిగా తీసుకునే ఇతర హీరోయిన్లు ఎదగాలని ప్రయత్నిస్తున్నారన్నది పరిశ్రమ వర్గాల మాట. అయితే తాజాగా అందరి గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రుతిహాసన్ మరోసారి వార్లల్లో కెక్కారు. ఆమె ఏమన్నారంటే...
 
 సినిమా నటీమణులందరూ తెరపై అందంగానే కనిపిస్తారు. అందుకు కారణం మేకప్, ఫోకస్ లైట్స్. హీరోయిన్లు అందంగా కనిపించడానికి ఇవే ముఖ్య కారణం. అయితే నేను మాత్రం ఎలాంటి మేకప్ లేకుండానే అందంగా ఉంటాను. నాది సహజ అందం. నా శరీరాకృతి కూడా కచ్చితమైన కొలతలతో ఉంటుంది. నా తల్లిదండ్రులు అందంగా ఉంటారు. అందువల్లే నేను అందంగా ఉన్నాను అని శ్రుతిహాసన్ పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు