సంక్రాంతి శోభ

16 Jan, 2014 00:24 IST|Sakshi

 దాదర్, న్యూస్‌లైన్: నవీముంబైలోని వాషి పట్టణంలో ఉన్న ‘తెలుగు కళా సమితి’ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం ఘనంగా జరిగిన ‘సంక్రాంతి సంబరాలు కార్యక్రమంలో తెలుగు ప్రజలంతా విశేషంగా పాల్గొన్నారు. రెండు రోజులపాటు ఏర్పాటుచేసిన ఈ సంబరాలలో మొదటిరోజు స్థానిక కళాకారులు, సమితి సభ్యులు, మహిళలు, బాల, బాలికలు పలు సాంస్కృతిక ప్రదర్శనలిచ్చారు. తొలుత గణేశుని వర్ణచిత్రాన్ని పూల మాలలతో అలంకరించి దీప ప్రజ్వలన చేశారు. సమితి అధ్యక్షుడు బండి నారాయణరెడ్డి, ప్రధాన కార్యదర్శి మాదిరెడ్డి కొండారెడ్డి ఆహూతులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ సంబరాలకు ఆహ్వానం పలికారు. ఆలాగే, ‘చేబియం కౌశికి’ ప్రార్థనా గీతంతో సంబరాలు ప్రారంభించారు.
 
 మహిళా సభ్యులు సంక్రాంతి పాటలతో, వాణి శ్రీపాద తదితర  గాయనీ గాయకులు భక్తి గీతాలను ఆలపించారు. సాంస్కృతిక కళా దర్శకురాలు కేతవరపు శోభారావు ఆధ్వర్యంలో రూపొందిన పలు నృత్యరూపకాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. మనదేశంలోని వివిధ రాష్ట్రాలలో జరిగే సంక్రాంతి పండుగ విశేషాలను తెలిపే విధంగా ఈ నృత్యాల ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించారు. తమిళనాడు (పొంగల్), మహారాష్ట్ర (మకర సంక్రాంతి), అస్సాం (మాఘబిహు), గుజరాత్ (మకర సంక్రాం త్-ఉత్తరాయణ్), పంజాబ్ (లోధీ) రాష్ట్రాల్లో ఆచరిస్తున్న సంక్రాంతి పండుగ సంబరాలను ప్రతిబిం బించిన ఈ నృత్యరూపకాలపై తెలుగులో సరళారావు వ్యాఖ్యానం సభికులను ఆకట్టుకుంది.  కూచిపూడి నాట్యకళాకారిణి సత్యా శ్రీనివాస్ (కొరియోగ్రాఫర్), వాణిశ్రీపాద, లక్ష్మీ రావు, పద్మా ప్రసాద్, మీనా, కాత్యాయని, డి.పద్మ, వైశాలి, విపు ల మహాజన్, పద్మాశేఖర్, విజయా మూర్తి, రేవతి, చంద్రకళారెడ్డి, శాంతిరెడ్డి, హరి ప్రియ, నిఖిత, నగపృథ్వి తదితరులు ఇందులో పాల్గొన్నారు. తెలుగు కళా సమితి తరఫున కేతవరపు శోభా రావు, కూచిపూడి నాట్యగురు శ్రీరామచంద్ర మూర్తి ముఖ్య అతిథులను, కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులను, గత విద్యా సంవత్సరంలో అత్యుత్తమ శ్రేణిలో ఉత్తీర్ణులైన విద్యార్థులను సత్కరించారు. టి.మంజులారెడ్డి వ్యాఖ్యానంతో తొలినాటి  సంబరాలు ఘనంగా జరిగాయి.
 
 పద్మశాలీల ‘పసుపు-కుంకుమ’
 సాక్షి, ముంబై: నాయిగావ్‌లోని పద్మశాలి యువక సంఘం మహిళా మండలి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలలో భాగంగా మంగళవారం సాయంత్రం పసుపు కుంకుమ కార్యక్రమాన్ని నిర్వహించారు. సంఘం భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో చిన్నారులు వివిధ వేషధారణల్లో సాంస్కృతిక, నృత్య ప్రదర్శనలు చేశారు. కాగా, ఈ నెల 5, 6 తేదీల్లో జరిగిన ముగ్గులు, ఇతర ఆటల పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. ముఖ్య అతిథులు తరిగొప్పు రాధిక ( శివసేన శాఖ ప్రముఖ్), గద్దె లలిత (ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ ప్రాథమిక విభాగం ప్రధానోపాధ్యాయురాలు), గిరిజ (స్వరమాధురి అధ్యక్షురాలు) పసుపు-కుంకుమ గురించి వివరించారు. కార్యక్రమానికి హాజరైన మహిళలందరినీ మహిళా మండలి తరఫున పసుపు-కుంకుమతోపాటు చిరు కానుకలను అందజేశారు. దాదాపు 720 మంది మహిళలు, 160 మంది చిన్నారులు పాల్గొన్నారని నిర్వాహకులు తెలిపారు.  నూతన  సంఘ ధర్మకర్తలు, కార్యవర్గం, మహిళా మండలి సమితి సభ్యులను సభకు పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా మండలి అధ్యక్షురాలు భోగ కళావతి, కార్యదర్శి రాధ, కోశాధికారి సంగిశెట్టి భాగ్యలక్ష్మి, ట్రస్ట్ చైర్మన్ పావని సుదర్శన్, కార్యవర్గ అధ్యక్షుడు కోడి చంద్రమౌళి, సంఘం ప్రధాన కార్యదర్శి కస్తూరి సుధాకర్, మేనేజింగ్ ట్రస్టీ గాడిపెల్లి గణేష్, ట్రస్టీ సభ్యులు బుధారపు రాజారాం, ముశం నారాయణ, కార్యవర్గ సభ్యులు పొన్న శ్రీనివాస్, బోడ శ్రీనివాస్ పాల్గొన్నారు.
 
 సూరత్‌లో..
 సాక్షి, ముంబై: సూరత్‌లో సంక్రాంతి వేడుకలు పల్లెటూరి వాతావరణాన్ని తలపించాయి. ప్రతాప్‌నగర్‌లోని శ్రీమార్కండేయ మందిరంలో మంగళవారం సాయంత్రం సంబరాలను నిర్వహించారు. ఎం.పి. సి.ఆర్.పాటిల్ ముగ్గుల పోటీలను ప్రారంభించా రు. పోటీల్లో 60 మంది మహిళలు పాల్గొన్నారు. సూరత్ తెలుగు వలస ప్రజల ఐక్య సమితి క్రీడాసాంస్కృతిక కమిటీ ఈ పోటీలను నిర్వహించింది. తెలంగాణ అంశం, ఆడశిశువులను కాపాడటం వంటి సందేశాత్మక  ముగ్గులు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విజేతలకు పవిత్ర శారీ హౌస్ అధిపతి గంగుల వెంకటేష్   బహుమతులను అందజేశారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే సంగీతాపాటిల్, సాంఘిక సంక్షేమ శాఖ సూరత్ ఎస్సీ, బీసీ డిప్యూటీ డెరైక్టర్ ఆర్.బి.గోయిల్, తెలుగు కార్పొరేటర్లు రాపోలు లక్ష్మి, పీవీఎస్ శర్మ, అన్నపూర్ణ, ఆలయ కమిటీ అధ్యక్షుడు సిరిమల్లె గణేష్, కార్యదర్శి వడ్డెపెల్లి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
 
 అహ్మదాబాద్‌లో వైభవంగా..
 స్థానిక శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో అహ్మదాబాద్ ఆంధ్ర మహాసభ ఆధ్వర్యంలో రంగవల్లుల పోటీలు నిర్వహించారు. ఎనిమిదేళ్ల బాలిక మనస్విని వేసిన ముగ్గు ప్రత్యేక బహుమతి పొందింది. జయ, లావణ్య ఆలపించిన కీర్తనలు అలరించాయి. పీవీపీసీ ప్రసాద్ సమన్వయంతో కొనసాగిన ఈ ఉత్సవాల్లో అహ్మదాబాద్ ఆంధ్ర మహాసభ అధ్యక్షుడు ద్వారకనాథ్ గుప్తా, కార్యదర్శి కె.సుబ్బారాయుడు, సహ కార్యదర్శి పున్నా రావు, గాంధీనగర్ తెలుగు సంఘం అధ్యక్షుడు మారుతి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కాగా ఎంవీఎస్ రవికుమార్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
 

మరిన్ని వార్తలు