మూడు కోట్లిస్తేనే చిరంజీవితో నటిస్తా

24 May, 2015 03:13 IST|Sakshi
మూడు కోట్లిస్తేనే చిరంజీవితో నటిస్తా

  సీనియర్ హీరోలకు హీరోయిన్లు దొరకడం లేదంటూ టాలీవుడ్ గగ్గోలు పెడుతోంది. మెగాస్టార్ చిరంజీవి ఇందుకు అతీతం కాదనే ప్రచారం జరుగుతోంది. 2007 తరువాత సినిమాలకు దూరం అయిన చిరంజీవి రాజకీయాల్లోకి ప్రవేశించారు. సొంతంగా ప్రజారాజ్యం పార్టీ స్థాపించి ఆ తరువాత ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా ఆయన తాజాగా మళ్లీ నటనపై దృష్టి సారించారు. సుమారు ఎనిమిదేళ్ల తరువాత 150వ చిత్రాన్ని చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రాన్ని ఆయన కొడుకు యువ నటుడు రామ్ చరణ్ భారీ ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
 
 ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకుడు. ఈ చిత్రానికి ఆటోజాని అనే టైటిల్‌ను కూడా అనుకున్నట్లు చిత్ర పరిశ్రమ వర్గాల టాక్. అంతా బాగానే ఉంది. హీరోయిన్ వ్యవహారమే సెట్ కాలేదు. ఈ చిత్రంలో నటి నయనతార నటిస్తే బాగుంటుందని చిత్ర యూనిట్ భావించినట్లు సమాచారం. అనుకున్నదే తడవుగా ఆమెను సంప్రదించగా ఓకే నేను రెడీ అయితే పారితోషికం మూడు కోట్లు ఇవ్వండి అని ఆమె అన్నట్లు ప్రచారం హోరెత్తుతోంది. దీంతో షాక్‌కు గురైన చిత్ర యూనిట్ ఆలోచనలో పడ్డట్టు సమాచారం.  అయితే నయనతార నిజంగా మూడు కోట్లు అడిగారా? ఈ ప్రచారంలో నిజమెంత? అన్నది నిలకడ మీదే తెలుస్తుంది. చిరంజీవి చిత్రంలో ఆయన సరసన నటించే అదృష్టం ఎవరికి దక్కుతుందో చూడాలి.ఆటోజానీలో ఒక హీరోయిన్‌గా నటించే లక్కీచాన్స్‌ను నటి అంజలి కొట్టేసినట్లు టాక్ వినిపిస్తోంది.
 

మరిన్ని వార్తలు