పక్కింటి మహిళతో వైరం.. బాలుడి హత్య

25 Jun, 2017 10:13 IST|Sakshi
పక్కింటి మహిళతో వైరం.. బాలుడి హత్య

బొమ్మనహళ్లి : పక్కింటి మహిళ తరచూ గొడవ పడుతోందనే కారణంతో ఆమె కుమారుడిని హత్య చేసిన యువకుడు.. మృతదేహాన్ని నీటి ట్యాంక్‌లో వేసి ఉడాయించాడు. ఈఘటన బెంగళూరు మైకోలేఔట్‌ పోలిస్‌ స్టేషన్‌ పరిధిలోని బిళ్లకహళ్లిలో శనివారం చోటు చేసుకుంది.

పోలీసుల కథనం మేరకు.. బిళ్లెకహళ్లిలో గౌరమ్మ అనే మహిళ తన ఆరేళ్ల కుమారుడు మనోజ్‌కుమార్‌తో కలిసి నివాసం ఉంటోంది. వీరి ఇంటి పక్కన  మహేష్‌ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇతనికీ, గౌరమ్మ మధ్య చాలాసార్లు గొడవలు జరిగాయి. దీంతో మహేష్‌ ఆమెపై కక్ష పెంచుకున్నాడు.  శనివారం ఉదయం మనోజ్‌కుమార్‌కు చాక్లెట్‌ ఆశ చూపిన మహేష్‌.. అదే ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఇంటిలోకి తీసుకెళ్లాడు. అక్కడ బాలుడిని ఇటుకలతో కొట్టి చంపివేశాడు. మృతదేహాన్ని నీటి ట్యాంక్‌లో వేసి ఉడాయించాడు.  కుమారుడు ఇంటికి రాకపోవడంతో గౌరమ్మ స్థానికుల సహాయంతో పలు ప్రాంతాల్లో  గాలించింది. చివరకు నీటి ట్యాంకులో  మనోజ్‌ మృతదేహం కనిపించింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని  ఆస్పత్రికి తరలించి మహేష్‌ కోసం గాలించారు. ఎట్టకేలకు యువకుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా ..తానే మనోజ్‌ను కొట్టి చంపినట్లు అంగీకరించాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు