రాజధానిలో నయా ట్రాఫిక్‌

28 May, 2018 10:04 IST|Sakshi
కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రంలో భారీ తెరపై ట్రాఫిక్‌ ప్రదర్శన నిర్వహిస్తున్న దృశ్యం 

భువనేశ్వర్‌ : నగరంలో అత్యాధునిక ట్రాఫిక్‌ నిర్వహణ వ్యవస్థను త్వరలో ప్రవేశ పెట్టేందుకు సన్నాహాలు చురుగ్గా సాగుతున్నాయి. నగరవ్యాప్తంగా ట్రాఫిక్‌ నియంత్రణను కేంద్రీకృతం చేయడం కొత్త వ్యవస్థ ధ్యేయం. ఈ వ్యవస్థలో భాగంగా కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఏర్పాటవుతుంది. జాతీయ స్థాయి స్మార్టసిటీల్లో తొలిసారిగా భువనేశ్వర్‌లో ట్రాఫిక్‌ నియంత్రణ కోసం కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఏర్పాటు కావడం విశేషం. ట్రాఫిక్‌ నియంత్రణతో రహదారి దుర్ఘటనల నివారణకు ఈ వ్యవస్థ దోహదపడుతుంది. భువనేశ్వర్‌ అభివృద్ధి సంస్థ (బీడీఏ) ఆధ్వర్యంలో ఈ వ్యవస్థ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నట్లు ఆ సంస్థ ఇటీవల ట్విటర్‌లో ప్రాథమిక సమాచారం జారీ చేసింది. నగరంలో మారు మూల ప్రాంతాల్లో ట్రాఫిక్‌ రవాణాపట్ల ఈ వ్యవస్థ దృష్టి సారిస్తుంది. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ట్రాఫిక్‌ వ్యవస్థతో పాటు అత్యవసర సేవల్ని కూడా ఈ కేంద్రం నుంచి నిర్వహిస్తారు.

పలు ప్రపంచ దేశాల్లో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో ట్రాఫిక్‌ నియంత్రణ జరుగుతోంది. కమాండ్‌ కేంద్రంలో భారీ తెరతో సీసీటీవీ కెమెరాతో అనుసంధానపరిచిన వ్యవస్థ పనిచేస్తుంది. నగరంలోని మారుమూల ప్రాంతాల్లో ట్రాఫిక్‌ కదలిక ఈ తెరపై ప్రదర్శితమవుతుంది. నగరవ్యాప్తంగా జన సందోహిత ప్రాంతాల్లో ఎక్కడికక్కడ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. వీటితో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానపరుస్తారు. స్మార్ట్‌సిటీగా గుర్తింపు సాధించిన నగరంలో జనాభాతో పాటు వాహనాల రద్దీ కూడా నిత్యం పుంజుకుంటోంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్‌ ప్రతిష్టంభనతో తరచూ రహదారి దుర్ఘటనలు సంభవిస్తున్నాయి. మృతుల సంఖ్య పెరుగుతోంది. ఈ పరిస్థితుల దృష్ట్యా కొనసాగుతున్న సౌర శక్తి ట్రాఫిక్‌ వ్యవస్థను విస్తరించి కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌గా మలిచేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు భువనేశ్వర్‌ నగర అభివృద్ధి సంస్థ పేర్కొంది. 

>
మరిన్ని వార్తలు