మోసం కేసులో నవ దంపతులు అరెస్ట్‌

18 Nov, 2018 12:04 IST|Sakshi

తిరువొత్తియూరు: ఇంజినీర్‌ను ప్రేమించినట్టు నటించి మోసం చేసిన నవదంపతులను పోలీసులు అరెస్టు చేశా రు. కుమరి జిల్లా నాగర్‌కోవిల్, రోజా మంగళం రోడ్డుకు చెందిన చౌదరి రాజా (34) ఇంజినీరింగ్‌ డిప్లమో పూర్తిచేశాడు. ఇతను నాగర్‌కోవిల్‌లోని ప్రైవేట్‌ కారు షోరూంలో పనిచేస్తున్నాడు. అదే సంస్థలో నెల్‌లై నాంగునేరి తాలూకాకు చెందిన పరమశివన్‌ కుమార్తె రాజేశ్వరి ఉమ (30) పనిచేస్తోంది. అక్కడ చౌదరి రాజా, ఉమ మధ్య పరిచయం ఏర్పడి ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఇద్దరూ వేర్వేరు కులాలకు చెందిన వారైనప్పటికీ ప్రేమను కొనసాగించినట్టు తెలిసింది. ఈ క్రమంలో చౌదరి రాజా వద్ద నుంచి రూ.10 లక్షలు వరకు నగదును ఉమ తన ఖాతాలో వేసుకుంది. 

వివాహం కోసం తొమ్మిది సవర్ల తాళి చైన్, ఒక సవరం చొప్పున నాలుగు గాజులు చేయించి ఉంచాడు. ఈ క్రమంలో సెప్టెంబర్‌ 21న ఉమ, చౌదరి రాజాకు ఫోన్‌ చేసి తనకు మరో యువకుడితో వివాహం జరిగిందని.. 22న రిసెప్షన్‌ రావాలని ఫోన్‌లో తెలిపింది. చౌదరిరాజా ఆమె వివాహ రిసెప్షన్‌లో పాల్గొని తాను ఇచ్చిన నగదు, నగలు తిరిగి ఇవ్వమని కోరాడు. తరువాత ఇస్తానని ఉమ అతన్ని సముదాయించింది. ఆమె నగదు, నగలు ఇవ్వకపోవడంతో చౌదరి రాజా వల్లియూర్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఉమ, ఆమె భర్త పరమశివన్‌ను శనివారం అరెస్టు చేశారు. వారిని కోర్టులో హాజరు పరిచారు. న్యాయమూర్తి కేసు విచారించి పరమశిశన్‌ను పాలై సెంట్రల్‌ జైలుకు, ఉమను కొక్కకులం మహిళా జైలులో ఉంచమని ఆదేశాలు జారీ చేశారు.

మరిన్ని వార్తలు